breaking news
-
రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం(జూన్23)తెలంగాణ భవన్లో మరో నేత రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. పవర్ కమిషన్ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. -
బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల Vs రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మియాపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.కాగా, శనివారం మియాపూర్లోని హెచ్ఎండీఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకోవడం.. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు. అలాగే, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అంటూ కామెంట్స్ చేశారు. No Law No OrderHave you ever seen such nonsense in last 10 years? https://t.co/nd4LP6P72n— KTR (@KTRBRS) June 23, 2024 ఇదిలా ఉండగా.. మియాపూర్లోని దీప్తిశ్రీనగర్లో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కాగా, శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్ఎండీఏ భూమి ఉన్నది. ఇందులో గుడిసెలు వేసుకొని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచారు. దాదాపు 2వేల మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు.అయితే, గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి.. హెచ్ఎండీఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీం కోర్టును ఆశ్రయించారని.. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. -
కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు. ప్రజావేదికతో సంబంధం లేదు ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు. -
రైతులను నట్టేట ముంచుతున్న రేవంత్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొదలవుతు న్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన రైతుభరోసా హామీని ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం అమలు చేయడం లే దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతాంగం గొంతుకోయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ, ఈ పాటికే రైతుబంధు డబ్బులు పడా ల్సి ఉందని, రైతుభరోసా పేరు చెప్పి రైతులను మో సం చేస్తున్నారని విమర్శించారు.రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని, అయితే అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని, సీజన్ అయిపోయాక రైతు భరో సా ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదని నిల దీశారు. కేసీఆర్ హయాంలో 68.90 లక్షల మందికి 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చినట్లు చెప్పారు.మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని, రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని అన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడి యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, డిసెంబర్ 9న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కేబినెట్లో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. -
బీఆర్ఎస్ టైటానిక్లా మునిగిపోతుంది
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్) ఖాయమన్నారు. టైటానిక్షిప్ మాదిరిగా బీఆర్ఎస్ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రఘునందన్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్రావు సమాధానాలిస్తూ.. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు. -
మీ అబద్ధాలకు సమాధిలో గోబెల్స్ సిగ్గుపడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి అబద్ధాల ప్రచార సృష్టికర్త జోసెఫ్ గోబెల్స్ కూడా సమాధిలో సిగ్గుతో తలదించుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం విషయంలో రేవంత్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని కేసీఆర్ వ్యతిరేకించినందునే గత ప్రభుత్వం ఎన్నడూ వేలంలో పాల్గొనలేదన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతోందని ఆరోపించారు. గతంలో నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే ఆ గనుల నుంచి తట్టెడు బొగ్గు కూడా ఎత్తలేకపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ పేర్కొన్న రెండు కంపెనీలు 2021లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గనులు దక్కించుకున్న విషయాన్ని రేవంత్ మర్చిపోరాదన్నారు.కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలుతెలంగాణ ప్రజల ఆకాంక్షలను క్రూరంగా అణచి వేసి వేల మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాల ను కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తాకట్టు పెడు తున్న తీరును తెలంగాణ పౌరులు గమనిస్తున్నా రన్నారు. ప్రజల హక్కులు, ఆస్తులు, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇప్పటికే నదీజలాల వాటాను వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గనుల వేలంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.పెట్టుబడుల్లో తెలంగాణ అగ్రస్థానంగత ఆర్థిక సంవత్సరం 2023–24లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తగ్గినా బీఆర్ఎస్ సాగించిన పాలన వల్లే తెలంగాణ మాత్రం 100 శాతానికి మించి ఎఫ్డీఐలను సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 2022–23తో పోలిస్తే 2023–24లో గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులను సాధించగా తెలంగాణ ఏకంగా 130 శాతం వృద్ధి సాధించిందన్నారు. అమెజాన్ వెబ్ సేవల కోసం రూ. 36,300 కోట్లు, మైక్రోసాప్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో రావడంతో ఇది సాధ్యమైందన్నారు. -
సింగరేణిలో ఆర్థిక విధ్వంసంపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీల పై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎస్ఆర్ ఫండ్స్ విని యోగం, సింగరేణి సంస్థ ద్వారా పలువురి విలాసా లకు చెల్లించిన బిల్లులు, ఇతర అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. శనివారం మాజీ ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నాయ కులు ప్రదీప్కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్. ప్రకాష్రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.గోదావరి తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే‘సింగరేణికి సంబంధించిన పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోలేక పోయింది. బొగ్గు, సహజ వనరుల విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేంద్రం ఓ రిఫరీగా విధివిధానాలు, పారదర్శకత తదితర అంశాలపైనే దృష్టి పెట్టగలదు. ఈ శాఖ మంత్రిగా నాకు కేవలం ఆరు రోజుల అనుభవమే ఉంది. సింగరేణిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తా.సింగరేణిని ప్రైవేటీకరిస్తామనడం శుద్ధ అబద్ధం. తప్పుడు ప్రచా రాలను నమ్మొద్దు. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశా, నిస్పృహలకు గురైన బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. ఈ దిశలో ఇప్పటికే హైదరాబాద్లోని సర్వే ఆఫ్ ఇండియాతో ప్రాథమిక చర్చలు జరిపాం’ అని కిషన్రెడ్డి తెలిపారు.పారదర్శకంగా బొగ్గు గనుల వేలం‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈనెలాఖరు వరకు సమయం ఉన్నందున ఒకవేళ రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది..’ అని కేంద్రమంత్రి వివరించారు. సింగరేణికి కేసీఆర్ మరణశాసనం‘సింగరేణి సంస్థకు మాజీ సీఎం కేసీఆర్ మరణ శా సనం రాశారు. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్సే. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి సంస్థ అకౌంట్లో రూ. 3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. కానీ కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్జెన్కో సింగరేణికి రూ.8,056 కోట్లు బకాయి పడింది. బొగ్గు, విద్యుత్కు సంబంధించి సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. ఆయన పట్ల సానుభూతి చూపాలి..’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు‘కాంగ్రెస్ మాటల పార్టీ తప్పితే.. చేతల ప్రభుత్వం కాదు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.నీట్తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం‘నీట్ పరీక్షా పత్రం లీక్ అవలేదు. దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో పరీక్ష జరిగితే, కేవలం నాలుగు సెంటర్లలో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చారు. నీట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ పరీక్ష కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పరీక్ష నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బావ, బావమరుదులు!
గులాబీ పార్టీలో వాళ్లిద్దరూ నోరు తిరిగిన నాయకులు. సబ్జెక్ట్ ఏదైనా, సమస్య ఏదైనా అనర్గళంగా స్పీచ్లు ఇవ్వగల సత్తా వారికుంది. అందుకే ఇప్పుడు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమట్లు పట్టిస్తున్నారు. ఒకదాని తర్వాత మరొక అంశం తీసుకుంటూ ఎక్కడి కక్కడ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరు బావా, బావమరుదులు తమకున్న నాలెడ్జ్తో కాంగ్రెస్ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ వారిద్దరూ బావ మరుదులు ఎవరో చూద్దాం.భారత రాష్ట్ర సమతి పార్టీలో మాటకారులు ఎక్కువే. సబ్జెక్ట్ ఏదైనా అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఇద్దరు నేతలకు ఉంది. సమస్య ఏదయినా, ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే అంశం ఏదైనా తూటాల్లాంటి మాటలతో అదరగొట్టేస్తారు గులాబీ పార్టీకి రెండు కళ్ళుగా ఉన్న బావ హరీష్ రావు, బావమరిది కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ విరుచుకుపడుతున్నారు ఈ ఇద్దరు నేతలు. రోజుకో సమస్యతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. దీనికి వీరిద్దరూ ఎంచుకున్న ప్లాట్ ఫాం ఎక్స్ లేదా ట్విట్టర్. ట్విట్టర్ లో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కరువవుతుంది. ఈ ఇద్దరు నేతలు ప్రజాసమస్యలపై చేస్తున్న కామెంట్స్తో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలవారి సమస్యలపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తున్నారు.కేటీఆర్, హరీష్ రావును తట్టుకోవడం అంటే చాలా కష్టం అంటున్నారు. నిత్యం ప్రెస్స్ మీట్స్, గంటకో ట్వీట్ చేస్తున్నారు. కేవలం రెండు నెలల సమయం ప్రభుత్వానికి ఇచ్చి, ఆతర్వాత ముప్పేట దాడి మొదలు పెట్టారు ఈ ఇద్దరు నేతలు. అయితే ప్రభుత్వం వైపు నుంచి అంతే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎవరూ సాహసం చేయటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరి ధాన్యం విషయంలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. శాంతి భద్రతలు విషయంలో ఒక్క పోస్ట్ తో పోలీస్ యంత్రాంగం కదిలింది. కరెంట్ సమస్యపై ప్రభుత్వం చేసిన ఆరోపణలకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు, కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన అంశంపై బీ ఆర్ ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ సర్కార్కు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏ చిన్న లూప్ హోల్ కనపడకుండా ఓ రేంజ్ లో వీరిద్దరూ సమాధానాలు ఇస్తున్నారు.ఏ సమస్య మీద అయినా కొంత ఆలస్యంగా స్పందించినప్పటికీ సబ్జెక్ట్, ఆధారాలతో సహా బయటికి వదులుతున్నారు. దీంతో ప్రభుత్వం సమాధానం కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పటికంటే బావ మరుదులు హరీష్రావు, కేటీఆర్లు ప్రతిపక్షంలోనే సమన్వయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్కు సరైన ప్రత్యర్థులు వీరిద్దరే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య..!
ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకుని తెలంగాణ బీజేపీ మాంచి జోష్ మీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా ఎంపీలయ్యారు. ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది. ఇంత జోష్లో ఉన్న బీజేపీ నేతలు, క్యాడర్కు ఓ ఇబ్బంది ఎదురవుతోంది. కొత్త ఎంపీలు, కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్ర నేతలు పడుతున్న ఇబ్బంది ఏంటి? శ్రేణులకు నాయకులు ఇచ్చిన భరోసా ఏంటి?తెలంగాణలో బీజేపీ ఫేస్గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. మోదీ రెండో కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్రెడ్డికి ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కింది. కాగా కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్కు కూడా కేంద్ర కేబినెట్లో పదవి దక్కింది.ఇప్పుడు బీజేపీకి రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళతో పాటుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీలో కూడా కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్యను భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవర్ సెంటర్స్ పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.కేంద్రంలోను, రాష్ట్రంలోను కమలం పార్టీ నుంచి ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో ఆటోమెటిక్గా పార్టీలో పవర్ సెంటర్స్ కూడా పెరిగాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బీజేపీ రాష్ట్ర సారథిగా కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ అనే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కిషన్ రెడ్డి మనిషిగా బండి సంజయ్ మనిషిగా ఈటల రాజేందర్ మనిషిగా ముద్ర పడితే భవిష్యత్లో పొలిటికల్ కేరీర్కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా నేత మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కవేమోననే భయం క్యాడర్ను పట్టి పీడిస్తోంది.కాషాయ సేనకు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలంతా పైకి బాగానే ఉంటారు. తామంతా ఒక్కటే అన్నట్లుగానే కనిపిస్తారు. కాని ఒకరి కంటే ఒకరు ముందుండాలని, పార్టీలో పట్టు సాధించాలని తపన పడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు కీలక నాయకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ముఖ్య నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మనిషిగా గుర్తింపు వస్తే..మరో నేతతో ఇబ్బంది వస్తుందనే భయం క్యాడర్ను, దిగువ స్థాయి నేతల్ని ఆవహించింది. అందుకే తమకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలున్న నాయకులను చాటు మాటుగానే కలుస్తూ స్థానిక నేతలు, క్యాడర్ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. -
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఏమైంది..?
ఏ పార్టీకైనా సొంతగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు తమకు అనుకూలంగా ఉన్నవర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయడం కూడా సహజమే.తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోలేకపోయిందా? అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మథనం మొదలైంది. ఇంతకీ బీఆర్ఎస్కు ఓట్ బ్యాంక్ ఉందా? లేదా? ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పార్టీకి నిబద్దతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓట్ బ్యాంక్గా భావిస్తారు. అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుంది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి..2014 తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది. కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది.గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు వచ్చాయి. అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా..మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్కు బలమైన, సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.గులాబి బాస్ కేసీఆర్కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన వుంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంక్గా మలచుకోవచ్చని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్ను అస్త్రంగా మలుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో వున్న తెలంగాణ పేటెంట్ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఏ ఒక్క సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ వాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పార్టీలోను, ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వుంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారంతా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యారు.మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
అవి ఏమయ్యాయ్?.. సీఎం రేవంత్కు హరీశ్రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారు.’’ అంటూ హరీశ్రావు నిలదీశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.’’ అంటూ హరీశ్ మండిపడ్డారు.మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డునపడి అలమటించవలసిన పరిస్థితి తెచ్చారు. గ్రూప్ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది. బాధ్యత గల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను, బాధలను, వినతులను మీ దృష్టికి తెస్తున్నాను. వెంటనే ఈ అంశాలపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను’’ అంటూ లేఖలో హరీశ్రావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలను తోడు దొంగలుగా అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కేటీఆర్. తెలంగాణ హక్కులను కాపాడటంతో సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారని.. ఇప్పటికే జలవనరులను తాకట్టు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు గనుల వేలానికి సిద్ధమయ్యారని.. అన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్ అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి కాంగ్రెస్ సహకారం అందించింది’’ అని కేటీఆర్ మండిపడ్డారు. -
రైతు ప్రభుత్వం అనడానికి సిగ్గులేదా రేవంత్?: ఎర్రబెల్లి ఫైర్
సాక్షి, హైదరాబాద్: మీది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అలాగే, తాను పార్టీ మారడంలేదని క్లారిటీ ఇచ్చారు.కాగా, ఎర్రబెల్లి దయాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. ఆరు నెలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. కరెంట్ లేదు, మోటార్లు కాలి పోతున్నాయి. రైతులు ఆగం అవుతున్నారు.. కుప్పకూలి పోతున్నారు ఇది నిజం.రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా రేవంత్ రెడ్డి?. ఆగస్టు 15 వరకు ఎలా రెండు లక్షల రుణమాఫీ చేస్తావు. ఇది మోసం.. బోగస్ మాటలు కాదా రేవంత్ రెడ్డి?. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిత్యం ఇచ్చాము. ఇప్పుడు రైతుబంధు లేదు, ఎరువులు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు. పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి.నేను పార్టీ మారటం లేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశాము. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. అంతే తప్ప నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్లోనే ఉంటూ మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే నా ధ్యేయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు: ఎంపీ రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు కేసుల్లో అన్ని వేళ్లు మాజీ సీఎం కేసీఆర్వైపే చూపిస్తున్నాయి. కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పోస్టుపై రఘునందన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై రఘునందన్ స్పందించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..‘పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు అని అన్నారు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులు అంతా కేసీఆర్ పేరే చెబుతున్నారు. అన్ని వేళ్లు కేసీఆర్వైపే చూపిస్తున్నాయి. త్వరలోనే కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు?.. వారిద్దరి వ్యాఖ్యల మర్మమేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో పార్టీ నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. పార్టీ అధ్యక్ష స్థానంపై పలువురు నేతలు ఫోకస్ పెట్టడంతో కమలం పార్టీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది.కాగా, పార్టీ చీఫ్ స్థానం కోసం కాషాయ పార్టీ నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్.. పార్టీలో కొత్త నీరు, కొత్త శక్తి అవసరం అంటూ కామెంట్స్ చేశారు. అనంతరం.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న వారికే పగ్గాలు ఇవ్వాలని రాజా సింగ్ అంటున్నారు. అలాగే, అందరి సలహాలు తీసుకున్న తర్వాతే హైకమాండ్ ప్రకటన చేయాలని రాజాసింగ్ సూచించారు. దీంతో, ఇద్దరి నేతలు వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.మరోవైపు.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంపీ డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ కూడా పోటీ నిలుస్తున్నారు. ఇక, వారితో పాటుగా ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, పాయల్ శంకర్ కూడా రేసులోకి వచ్చారు. అటు సీనియర్ నేతలు మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు వంటి నేతలు కూడా హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ చీఫ్ పోస్టు కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. -
కిషన్రెడ్డికి నీట్ సెగ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.వివరాల ప్రకారం.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తాగింది. తాజాగా ఎన్ఎస్యూఐ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అంబర్పేట్ పోలీసు స్టేషన్కు తరలించారు. -
విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. ‘మా పారీ్టలో చేరండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విధంగా వ్యవహరిస్తోంది’అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డిని హరీశ్రావు కలిశారు. గురువారం జరిగిన ఈడీ సోదాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వర్తించేలా చట్ట సవరణ చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. ఈడీ దాడుల్లో దొరికిందేమీ లేదు.. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంట్లో ఈడీ చేపట్టిన సోదాల్లో డబ్బు, బంగారం, ఎలాంటి వస్తువులు అక్రమంగా దొరకలేదని హరీశ్రావు చెప్పారు. ఆదాయపన్ను చెల్లిస్తున్న ఎమ్మెల్యే వద్ద ఆదాయ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. లీకేజీకి కారణమైన అధికారులపై ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయట్లేదని నిలదీశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జెడ్పీ వైస్ చైర్మన్ మంజుశ్రీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ను బీజేపీ రద్దు చేసింది
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని అప్పట్లో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మెట్టుసాయికుమార్, కోట్ల శ్రీనివాస్లతో కలసి ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు దేవుడి పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప బతుకుతెరువు కోసం ఉద్యోగాలు ఇప్పించడం తెలియదని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాష్ట్ర యువతకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు దక్కేవని, కానీ ఆ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గడ్డ సేఫ్టీకి అడ్డా అని, అందుకే ఐటీఐఆర్ను సోనియాగాంధీ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్లు హైదరాబాద్ గడ్డపై ఐటీఐఆర్తో అడుగుపెట్టి ఉంటే ప్రజలు సంతోíÙంచే వారన్నారు. ఇప్పుడు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టును మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదేనని, వారికి ఎప్పటికప్పుడు ఐటీఐఆర్ గురించి గుర్తుచేస్తుంటామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అంశం తన పరిధిలోనిది కాదని, శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. -
కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని పోచా రం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు.. చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహా్వనించారు. పోచారంతో పా టు ఆయన కుమారుడు భాస్కర్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడే సీఎం మీడియాతో మాట్లాడారు. అండగా నిలవాలని కోరా తెలంగాణ పునరి్నర్మాణంలో భాగంగా పోచారంను కలిశామని, పెద్ద నాయకుడిగా తమకు అండగా నిలబడాలని కోరామని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. రైతుల విషయంలో పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. తమది రైతు రాజ్యమని, రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి రైతు పక్షపాతి: పోచారం సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతి అని పోచారం చెప్పారు. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యమైనవని పేర్కొన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు. రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లలో పనిచేసినా చివరకు కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని చెప్పారు. రేవంత్రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో మరిన్ని చేరికలు?పోచారం చేరిక నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. దానం నాగేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలంటూ ఏకంగా ఓ జాబితానే ప్రకటించారు. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించారు.పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్రావు, కేటీఆర్లు తప్ప మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని ఆయన చెప్పడం గమనార్హం. కాగా దానం, తాజాగా పోచారంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పారీ్టలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి 70కి చే రడం గమనార్హం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్ యత్నంబంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసం నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు అక్కడకు వచ్చారు. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది.ఈ క్రమంలో బాల్క సుమన్ను బలవంతంగా బయటకు తీసుకువచి్చన పోలీసులు జీపులో కూర్చోబెట్టి తరలించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెల్లాచెదురు చేసి. బాల్క సుమన్ను బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. సీఎంఉ ండగానే పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బాల్క సుమన్తో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, అందరికీ బెయిల్ మంజూరైంది. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
సింగరేణి గొంతు కోస్తున్నా వారికి బాధ, రంది లేవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేలపై కేంద్రం సింగరేణి గొంతు కోస్తున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రంది లేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. వారిద్దరికీ తెలంగాణ ప్రజలపై ప్రేమ, సింగరేణి కారి్మకులపై అభిమానం లేదని విమర్శించారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి వందేళ్ల సింగరేణి భవిష్యత్తును చీకట్లోకి నెట్టి కిషన్రెడ్డి, భట్టి ఫొటోలకు పోజులివ్వడం బీజేపీ, కాంగ్రెస్ కుట్రలకు నిదర్శనమని దుయ్యబట్టారు. సిరుల గనికి మరణ శాసనం రాస్తూ వేలాది మంది కారి్మకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి సీఎం వెళ్లి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సహజ సంపదను చెరబట్టి కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న వికృత క్రీడను చరిత్ర క్షమించదని కేటీఆర్ వ్యాఖ్య. రేవంత్ మౌనం వెనుక ప్రశ్నలు... గతంలో సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన సీఎం రేవంత్రెడ్డి ప్రస్తుతం మౌనం వహించడం కాంగ్రెస్ అవకాశవాదానికి అద్దం పడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంలో వైఖరి మార్చుకోవడం వెనుక ఒత్తిళ్లను రేవంత్ రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు. నీతిలేని బీజేపీ నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లండి తెలంగాణ ప్రగతిప్రస్థానంపై బురదచల్లడం మా ని అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ప దేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి నమూనా ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమంటూ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ప్రచురించిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ కథనంలో మ్యాగజైన్ పొందుపరిచిన గణాంకాలను కేటీఆర్ ప్రస్తావించారు. -
కేసీఆర్ను విమర్శించడమే కాంగ్రెస్, బీజేపీ పని
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలతో ఎదురుదాడి చేయడం మినహా కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ సోయి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందన్నారు. దీంతో తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ పారీ్టయేనని మరోమారు నిరూపితమైందన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అప్పగింత, గోదావరి, కావేరి అనుసం«ధానం సహా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఇతరులకు ధారాదత్తం చేస్తున్న ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు.సింగరేణి బ్లాకుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని డ్రామాలు ఆడుతున్నాయన్నారు. శ్రావణి బ్లాక్ వేలంపై డిప్యూటీ సీఎం భట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసం వద్ద నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డికి కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. కేసీఆర్కు దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, మీడియాలో కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, తెలంగాణ ముఖచిత్రం నుంచి ఆయనను అదృశ్యం చేయాలనుకుకోవడం కుదిరేపని కాదని అన్నారు. -
అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ శుక్రవారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.‘కేటీఆర్ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్ఆర్ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్లో విమర్శించారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకంతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూ డా కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయ ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అ సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని, సింగరేణిలో కేంద్రానిది 49% వాటా, రాష్ట్రానిది 51% ఉందన్నారు. అట్లాంటప్పడు సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవే ట్ వారికి అప్పగించింది నిజం కాదా? సింగరేణి ని ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని ఆరోపించా రు. నాగర్కర్నూల్ ఘటన దారుణం ఇల్లందకుంట: నాగర్కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించా రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరుతూ దందాలు చేçస్తున్న క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.అడ్వొకేట్ కమిషనర్ ముందు హాజరవ్వండికేంద్రమంత్రి బండికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్పై అడ్వొకేట్ కమిషనర్ కె.శైలజ (రిటైర్డ్ జడ్జి) ముందు హాజరుకావాలని కేంద్రమంత్రి బండి సంజయ్ను హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ ముందు సాక్ష్యం చెప్పకుంటే పిటిషన్పై విచారణ ను ముగిస్తామని స్పష్టం చేస్తూ తదిపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలిచ్చారని, నిరీ్ణత ఖర్చుకు మించి ఎక్కువ ఖర్చు చేశారని, ఆయన ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పలుమార్లు గైర్హాజరయ్యారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించినా.. సంజయ్ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తిరిగి వాదనలు ప్రారంభించింది. ఈ పిటిషన్పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచా రణ చేపట్టారు. ఈ వారమే బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, బిజీ షె డ్యూల్ కారణంగా సాక్ష్యం ఇచ్చేందుకు హాజరుకాలేకపోయారని విచారణ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు.