హిందుత్వ అంశంపై శివసేన, బీజేపీలు ఒక్కటవ్వాలని తాను కోరుకుంటున్నట్టు బీజేపీ నాయకులు సుబ్రమణ్యం స్వామి పేర్కొన్నారు.
ఉద్ధవ్తో సుబ్రహ్మణ్యస్వామి భేటీ
సాక్షి, ముంబై: హిందుత్వ అంశంపై శివసేన, బీజేపీలు ఒక్కటవ్వాలని తాను కోరుకుంటున్నట్టు బీజేపీ నాయకులు సుబ్రమణ్యం స్వామి పేర్కొన్నారు. శివసేనను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం నుంచి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో బీజేపీ నాయకులు మళ్లీ చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాతోశ్రీలో ఉద్ధవ్తో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్లు శుక్రవారం చర్చలు జరపగా, శనివారం సుబ్రమణ్య స్వామి ఉద్ధవ్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందుత్వవాదంపై రెండు పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. తొందర్లోనే బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఉద్ధవ్తో భేటీ కానున్నట్టు చెప్పారు. ఏదేమైనా.. శివసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.