3 జిల్లాల్లో షట్డౌన్ ఎత్తివేత: డీజీపీ
ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రంలోని 3 జిల్లాల్లో షట్డౌన్ ఎత్తివేస్తున్నట్లు డీజీపీ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అభయ్ ఆదివారం ప్రకటించారు. ఉదయం నుంచే జాజ్పూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో కొనసాగుతున్న షట్డౌన్ తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో 60 గంటల షట్డౌన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్కుమార్ త్రిపాఠి నుంచి ఉత్తర్వులు అందాయని, ఈ మేరకు గురువారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు షట్డౌన్ అమలు చేసినట్లు ఆయన వివరించారు. అయితే షట్డౌన్ కాల వ్యవధిలో ప్రజల నుంచి అందిన సహకారం మరువలేనిదని డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. లోగడ జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా ప్రజలంతా భౌతికదూరం పాటిస్తూకరోనా నియంత్రణకు సహకరించాలని పిలుపునిచ్చారు.