ఇక సేవలు విస్తృతం

ఇక సేవలు విస్తృతం - Sakshi


 అందరూ ఏకమై ఒకే వేదికగా రాష్ర్టంలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సేవను విస్తృతం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్  నేతలు నిర్ణయించారు. తమిళనాడు వైఎస్‌ఆర్ సీపీ వేదికగా సభ్యత్వ నమోదు ప్రక్రియకు చర్యలు చేపట్టారు. త్వరలో రాష్ట్ర పార్టీ కమిటీని అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకటించనున్నారు. చెన్నైలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.

 

 సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద తమిళనాడులో ప్రత్యేక గౌరవం, అశేష అభిమానం ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి అండగా తామున్నామని ఇక్కడి వారు చాటుతూ వస్తున్నారు. దివంగత నేత వారసుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో తమ సేవల్ని అందించే కార్యకర్తలు ఇక్కడ  కోకొల్లలుగా ఉన్నారు. ఇన్నాళ్లు ఎవరికి వారు అన్నట్టుగా తలా ఓ దారిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.  ఇకపై అలా కాకుండా, అందరూ ఏకమై తమిళనాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికగా కార్యక్రమాలు, సేవల్ని విస్తృత పరచడంతోపాటుగా తెలుగు వారి సమస్యలపై గళం విప్పేందుకు సిద్ధం అయ్యారు. ఇందు కోసం నగరంలోని పెరంబూరు సోమ సుందరం నగర్ వేదికగా నాయకులు భేటీ అయ్యారు.

 

 నేతల భేటీ:

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు జకీర్ హుస్సేన్ నివాసంలో రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. తమిళనాడులో పార్టీ పరంగా సేవల్ని చేపడుతున్న వివిధ విభాగాల నాయకులు శరవణన్, మేడగం శ్రీనివాసరెడ్డి, సైకం రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, సి.వినోద్ కుమార్, వి.పవన్‌కుమార్, ఎం.దయాకర్ రెడ్డి, గొట్టం కోటిరెడ్డి, డి.సాయినాథ్‌రెడ్డి, శ్రీకాంత్ ఆబోతుల, ఎం.జగన్‌మోహన్ , ఎం హుస్సేన్‌బాషా తదితరులతోపాటుగా సవిత, ఎస్‌ఆర్‌ఎం, పనిమలర్, సత్యభామ, భారత్, ఠాకూర్ వర్సిటీల విద్యార్థులు, పలు ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సమావేశానికి తరలివచ్చారు. రాష్ర్టంలో తెలుగువారు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు, సమస్యలు, పార్టీ పరంగా కార్యక్రమాలు, ప్రజా సేవల విస్తృతం, సభ్యత్వ నమోదు, పార్టీ రాష్ట్ర కమిటీ ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.

 

 కమిటీ : పార్టీ అధ్యక్షులు ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వైఎస్ అనిల్‌రెడ్డి సూచనలతో తమిళనాడు  రాష్ట్ర పార్టీ  కమిటీ ఎంపికకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అండ్ ఇన్‌చార్జ్, రాష్ట్ర  కన్వీనర్ అండ్  అధికార ప్రతినిధి, రాజకీయ వ్యవహారాల జాయింట్ కన్వీనర్, రాజకీయ వ్యవహారాల కో-ఆర్డినేటర్, రాష్ట్ర ఐటీ విభాగం అండ్ ప్రచార కన్వీనర్, రాష్ట్ర ఐటీ విభాగం కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి అండ్ ప్రచార కన్వీనర్, విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీ, కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్, మహిళా కన్వీనర్, జాయింట్ కన్వీనర్, కో-ఆర్డినేటర్, రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్, కో-ఆర్డినేటర్, రాష్ర్ట మైనారిటీ సెల్ కన్వీనర్‌తోపాటుగా 30 మంది సభ్యులతో తమిళనాడు కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఆయా పదవుల భర్తీ లక్ష్యంగా కొన్ని పేర్లను ఎంపిక చేసి వైఎస్ అనిల్‌రెడ్డి ద్వారా అధిష్టానం ఆమోదంతో ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమావేశంలో కొరుక్కుపేట వైఎస్‌ఆర్ సీపీ అభిమానులు జి.సురేష్, జి.చంద్రశేఖర్, జి.ఆనంద్ బాబు, జె.నెల్సన్‌బాబు, ఎం.రత్నం, పాండిచ్చేరి ఆనంద్, ఐటీ, విద్యార్థి విభాగాలకు చెందిన డి.ఆనందం, సురవరపు కృష్ణారెడ్డి, వి విష్ణువర్ధన్‌రెడ్డి, డి.విష్ణురెడ్డి, ఎస్ హర్షవర్ధన్, ఎస్‌ఎం రోహిత్, ఎం.రాజశేఖరరెడ్డి, కె.మనోజ్, బి విష్ణువర్ధన్, రిజ్వాన్, దివాకర్, చౌసేన్‌బాషా, శ్రీనాథ్ రెడ్డి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 ఒకే వేదికగా:  సమావేశానంతరం మీడియాతో మేడగం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వేదికగా ఇక అందరూ కలసి కట్టుగా కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. మహానేత వైఎస్‌ఆర్, జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల సాధన లక్ష్యంగా శ్రమించనున్నామని తెలిపారు. త్వరలో ఏర్పడే కమిటీ ద్వారా ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ కార్యక్రమాలు నిర్వహించే విధంగా, సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టే రీతిలో కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు. తెలుగు వారికి,పేద నిరుద్యోగులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సైకం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదే శ్ అభివృద్ధి జగన్ సీఎం కావడం ద్వారానే సాధ్యమన్నారు. తెలుగు రానప్పటికీ, తాము సేవల్ని కొనసాగిస్తూ వచ్చామని, అయితే, ఇంత పెద్ద ఎత్తున అందరూ  ఒకే వేదిక మీదుగా కార్యక్రమాల్ని విస్తృత పరిచేందుకు ముందుకు రావడం తనకు ఆనందంగా ఉందని జకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. తమకు గతంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగినట్టు వివరించారు.  ఇప్పుడు ఇక్కడున్న వారందర్నీ చూస్తుంటే, త్వరలో చెన్నైలో అతి పెద్ద  పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి తీరుతానని స్పష్టం చేశారు. గురుమూర్తి మాట్లాడుతూ, తెలుగు వారి సమస్యల పరిష్కారం లక్ష్యంగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్న కాంక్షతో ప్రతి ఒక్కరం ఇక శ్రమిద్దామని, పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపు నిచ్చారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top