ఈ ఉత్సవం.. పురుషులకు మాత్రమే..! | Only men are eligible for worship here | Sakshi
Sakshi News home page

ఈ ఉత్సవం.. పురుషులకు మాత్రమే..!

Aug 1 2017 5:34 PM | Updated on Sep 11 2017 11:01 PM

స్త్రీలు మాత్రమే పూజలు జరపడం ఆనవాయితీగా ఉండే తమిళనాడులో ఏటా జరిగే విడ్డూరమిదీ.

చెన్నై: స్త్రీలు మాత్రమే పూజలు జరపడం ఆనవాయితీగా ఉండే తమిళనాడులో ఏటా జరిగే విడ్డూరమిదీ. నామక్కల్‌ జిల్లా పొంగలాయి ఆలయంలో పూజలకు పురుషులు మాత్రమే అర్హులు. రాశిపురం సమీపంలో మలైయాంపట్టి గ్రామంలో 500 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పొంగలాయి అమ్మవారి ఆలయం ఉంది. మర్రి చెట్టు కింద స్వయంభువుగా వెలసిన అమ్మవారి ఆలయంలో ఏటా ఆడి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పురుషులు మాత్రమే పాల్గొని పొంగలి వండి మేకలు బలి ఇచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలు గత 21వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా ఆదివారం రాత్రి అళంగతాయ్‌ అమ్మన్‌కు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం ఆలయం సమీపంలో గల కరుప్పు స్వామికి ప్రత్యేక పూజలు జరిపి మేకలను బలిచ్చారు. ఆలయ నిర్వాహకుల సమక్షంలో ముందుగా ఆడ మేకను బలి ఇచ్చారు. అనంతరం భక్తుల మొక్కుల ప్రకారం 140 మేకలను బలి ఇచ్చారు. అనంతరం సోమవారం సాయంత్రం సమబంతి విందు జరిపారు. ఇందులో ఐదు వేల మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. పురుషులు మాత్రమే జరిపే ఈ పూజల వలన ప్రజలు ఎటువంటి శారీరక బాధలు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని పంటలు బాగా పండాలని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగాలని కోరుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement