వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపాలని మహారాష్ట్ర తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు...
- ముంబై నుంచి తెలుగు ప్రజల కోసం ఒక్క ప్రత్యేక రైలు లేదు
- రైళ్లకు కనీసం అదనపు బోగీలైనా ఏర్పాటు చేయండి
- మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న తెలుగు ప్రజలు
సాక్షి ముంబై: వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపాలని మహారాష్ట్ర తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయమై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు దృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ముంబై నుంచి అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారని, తెలుగు ప్రజల కోసం ఒక్క రైలు కూడా నడపడంలేదని వాపోతున్నారు. బస్సుల్లో చార్జీలు రెట్టింపు ఉన్నాయని, రైళ్లలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వేసవి రద్దీ కారణంగా టికెట్లు లభించడం లేదని అంటున్నారు. తత్కాల్ టికెట్ కోసం గంటలకొద్దీ క్యూ కట్టినా ప్రయోజనం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్కుమార్ 2013-2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ముంబై (లోకామాన్యతిలక్ టర్మినస్) - నిజామాబాద్, ముంబై (లోకామాన్యతిలక్ టర్మినస్) - కాకినాడ రైళ్లను ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ల మీదుగా తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలకు కూడా వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరుతున్నారు. ప్రత్యేక రైళ్లు నడపటం కుదరకపోతే ప్రస్తుత రైళ్లకు అదనపు బోగీలైనా అమర్చాలని కోరుతున్నారు.
తెలుగు ప్రజలకు ఒకే రైలు
ముంబై, ఠాణే, భివండీ, కళ్యాణ్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల తెలుగు ప్రజలకు ముంబై నుంచి ప్రతిరోజు నడిచే దేవగరి ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది. కొత్తగా లోనమాన్య తిలక్ (కుర్లా)-నిజామాబాద్ల మధ్య రైలు ప్రారంభించినప్పటికీ వారానికి ఒకసారి నడిపిస్తుండటంతో ప్రజలు దేవగిరికి మొగ్గుచూపుతున్నారు. అయితే వేసవి సెలవుల కారణంగా ఈ రైలులోనూ రద్దీ పెరిగింది. మరోవైపు దేవగిరిలో నాందేడ్ ప్రజలకు ప్రత్యేక కోటాను కల్పించారు. దీంతో ఏడాది పొడవునా రైళ్లో టికెట్ లభించడం కష్టసాధ్యంగా మారింది.
కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి. దీంతో దేవగరి రైలుకు మరిన్ని బోగీలను అమర్చడంతోపాటు లోకమాన్య తిలక్-నిజామాబాద్ రైలును ప్రతి రోజు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంబై నుంచి ఆ మార్గంలో వెళ్లే ఓ రైలును నిజామాబాద్ వరకు పొడగించాలని కోరుతున్నారు. నిజామాబాద్ల మీదుగా మన్మాడ్, నాగర్సోల్ వరకు నడుస్తున్న రైళ్లను ముంబై వరకు పొడగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఠాణేలో ఆపండి
నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు ఠాణేలో ఆపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు నివసిస్తున్నారు. వీరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్, విశాఖపట్నం, లోకమాన్య తిలక్-కాకినాడా ఎక్స్ప్రెస్లపై ఆధారపడుతున్నారు. వారానికి ఒకసారి నడిచే భావనగర్-కాకినాడా రైలు కూడా వయా కళ్యాణ్ వెళ్తోంది. ఎల్టీటీ-కాకినాడా రైలు వారానికి రెండు సార్లు నడుపుతున్నారు. అయితే ఈ రైళ్లు ఠాణేలో నిలపకపోవడంతో ప్రజలు లోకామాన్యతిలక్ టర్మినస్ లేదా, కళ్యాణ్ వరకు వెళ్లాల్సి వస్తోంది.