గడ్చిరోలి, చంద్రపూర్‌లను తెలంగాణలో విలీనం చేయండి | If no Vidarbha, include Gadchiroli, Chandrapur in Telangana | Sakshi
Sakshi News home page

గడ్చిరోలి, చంద్రపూర్‌లను తెలంగాణలో విలీనం చేయండి

Aug 13 2013 11:42 PM | Updated on Apr 7 2019 4:30 PM

ఓ వైపు ప్రత్యేక విదర్భ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది.

గడ్చిరోలి, న్యూస్‌లైన్: ఓ వైపు ప్రత్యేక విదర్భ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది.  ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ధర్మారావ్‌బాబా ఆత్రం డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా విదర్భ డిమాండ్ చాలా పాతదని, అయితే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు.
 
 అయితే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలన్న అత్రమ్ వ్యాఖ్యలు విదర్భతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం స్వచ్చంద సంస్థలతోపాటు బీజేపీ ఓవైపు ఉద్యమం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌నాయకుడు విలాస్ ముత్తెంవార్ ప్రత్యేక విదర్భ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఎన్సీపీ కూడా మద్దతు పలికింది. అయితే ఇటీవలే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైతే ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యమన్నారు. దీనిపై పరోక్షంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యం కాకపోతే గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. ఇలాచేస్తే తెలంగాణాతో పాటు ఈ రెండు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబై ఈ జిల్లా నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో రాజధానిలో బతుకుతెరువుకోసం ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే తెలంగాణలో విలీనం చేస్తే రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ మారతుందన్నారు. ఈ జిల్లాల నుంచి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా మారితే రాకపోకలకు ఇబ్బందులు ఉండవన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement