కోహ్లి అండర్-19 టీమ్మెట్ ఏం చేస్తున్నాడో తెలుసా?
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: 2008 అండర్-19 ప్రపంచకప్ను గెలుచుకోని భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే ఈ ప్రపంచకప్ టీమ్లో సభ్యుడు.. ఫైనల్లో సౌతాఫ్రికాను దెబ్బతీసిన బౌలర్ అజితేష్ అర్గల్ మాత్రం ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్కు గురవుతారు.
ఈ ఫైనల్ మ్యాచ్లో ఐదు ఓవర్లు వేసిన ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం ఏడు పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి ‘చిన్న కోహ్లి సేన’ను ప్రపంచ విజేతగా నిలబెట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ కూడా అందుకున్నాడు. అంతేగాకుండా ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్లోనే కింగ్స్ఎలెవన్ పంజాబ్జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాకపోతే సీనియర్ బౌలర్లు ఉండటంతో అజితేష్కు ఆడే అవకాశం రాలేదు. అనంతరం 2013 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అజితేష్ జాతీయ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు.
దీంతో క్రికెట్కు స్వస్తీ చెప్పి ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం వడోదరలో ఉద్యోగం చేస్తున్నాడు. మెరుగైన బంతులతో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టే అజితేష్ 10 ఏళ్ల వయసులోనే మధ్యప్రదేశ్ అండర్-14 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అదృష్టం వెక్కిరిస్తే అరటి పండు తిన్నా పళ్లు ఇరుగుతాయన్నట్లు ఈ క్రికెటర్ను కూడా దురదృష్టం వెంటాడింది. తన అండర్-19 టీమ్ మెట్స్ల్లో కోహ్లి టీమిండియా కెప్టెన్ కాగా.. రవీంద్ర జడేజా ప్రపంచ స్టార్ స్పిన్నర్గా, అభినవ్ ముకుంద్, మనీష్ పాండేలు ఐపీఎల్ స్టార్లుగా ఎదిగారు.
సంబంధిత వార్తలు