ఆఫ్రిది డకౌట్‌.. అయినా భారీ విజయం

Royals won by 6 wickets against Palace Diamonds - Sakshi

సెయింట్‌ మోర్టిజ్‌: ఐస్‌ క్రికెట్‌ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించినా అతడి జట్టు ఓడిపోయింది. షాహిద్‌ ఆఫ్రిది డకౌటైనప్పటికీ అతడి టీమ్‌ గెలిచింది. సెయింట్‌ మోర్టిజ్‌ ఐస్‌ క్రికెట్‌ 2018లో భాగంగా గురువారం జరిగిన టి20 మ్యాచ్‌లో రాయల్స్‌ ఎలెవన్‌ చేతిలో ప్యాలెస్‌ డైమండ్స్‌ ఎలెవన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఓపీ షా సునామీ ఇన్నింగ్స్‌తో 165 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్‌ సునాయాసంగా ఛేదించింది. షా 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. 15.2 ఓవర్లలో రాయల్స్‌ 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కల్లిస్‌ 36, స్మిత్‌ 23 పరుగులు సాధించారు. డైమండ్స్‌ బౌలర్లలో రమేశ్‌ పొవార్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్‌, మలింగ చెరో వికెట్‌ తీశారు.

సెహ్వాగ్‌ నాయకత్వంలోని డైమండ్స్‌ టీమ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు సాధించింది. సెహ్వాగ్‌ చెలరేగి ఆడి అర్ధసెంచరీ బాదాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సిర్లతో 62 పరుగులు చేశాడు. సైమండ్స్‌ 40 పరుగులు పిండుకున్నాడు. మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. రాయల్స్‌ బౌలర్లలో అబ్దుల్‌ రజాక్‌ 4, షోయబ్‌ అక్తర్‌ 2 వికెట్లు కూల్చారు. ఆఫ్రిది, మెక్‌కల్లమ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top