వాలీబాల్ లీగ్ అంబాసిడర్గా సింధు
ముంబై: ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్), ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లు విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో కొత్త లీగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్–1 ప్రారంభం కానుంది. ఈ లీగ్కు రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అమెరికన్ స్టార్ స్పైకర్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
‘నా తల్లిదండ్రులు రమణ, విజయ వాలీబాల్ ఆటగాళ్లు కావడంతో చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి ఆడేందుకు భారత ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం’ అని సింధు తెలిపింది. ‘భారత్లో వాలీబాల్ అభివృద్ధికి ఈ లీగ్ ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక లీగ్లలో పాల్గొన్నాను. ఇప్పుడు అది ఇక్కడ కూడా కొనసాగేందుకు ప్రయత్నిస్తా’ అని రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత డేవిడ్ లీ అన్నాడు.