నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ.. | No Virat Kohli in ICC Test Team of the Year, Anurag Thakur unimpressed | Sakshi
Sakshi News home page

నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ..

Dec 24 2016 11:06 AM | Updated on Sep 4 2017 11:31 PM

నంబర్ వన్ జట్టుకు  కెప్టెన్ అయినప్పటికీ..

నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ..

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన టెస్టు జట్టులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి స్థానం దక్కకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ :గత రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన టెస్టు జట్టులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి స్థానం దక్కకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఒకసారి ఐసీసీ పరీశీలిస్తే బాగుండేదని అనురాగ్ సూచించారు. ఇటీవల కాలంలో భారత్ ఘన విజయాలను సాధించడమే కాదు.. టెస్టుల్లో నంబర్ వన్గా ఉందనే విషయం గుర్తు చేశారు. ఒక నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తికి టెస్టు జట్టులో స్థానం దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

 

' ఈ జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఐసీసీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే బాగుండేదనేది నా  భావన. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఆటగాళ్లు ప్రదర్శన కాకుండా, గత జనవరి నుంచి వచ్చే జనవరి వరకూ ఆటగాళ్ల ప్రతిభను పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. దాంతో పాటు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ను కూడా సమీక్షించాలి. టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ గా ఉండి, ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లికి ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో చోటు లభించకపోవడం బాధాకరం. కాకపోతే ఐసీసీ వన్డే కెప్టెన్ గా కోహ్లిని ఎంపిక చేయడం మాత్రం నిజంగా శుభవార్తే.  రాబోవు సీజన్లో ఐసీసీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత జట్టులను ప్రకటిస్తుందని అనుకుంటున్నా'అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

 గతేడాది సెప్టెంబర్ 14 నుంచి మొదలుకొని 2016 సెప్టెంబర్ 20 వరకూ మాత్రమే ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి 45.10 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ 12 నెలల సమయంలో  కోహ్లి కేవలం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు. అదే  సమయంలో రూట్ 14 టెస్టు మ్యాచ్లు ఆడి 55.30 సగటుతో 1272 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. దాంతో మాంచెస్టర్లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి ఆ ఏడాదిని(ఐసీసీ పరిగణలోకి తీసుకున్న సమయం ప్రకారం) ఘనంగా ముగించాడు.


కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత విరాట్ కోహ్లి ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు చేరాయి. న్యూజిలాండ్ తో  తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో కూడా ద్విశతకం సాధించాడు. ఈ క్రమంలోనే ఆ రెండు టెస్టు సిరీస్ల్లో 80.33 సగటుతో 964 పరుగులు చేశాడు. విరాట్ ఆడిన వరుసగా ఆడిన ఆరుటెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం ఇక్కడ విశేషం.  ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లి రెండో  స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ల అనంతరం కోహ్లి ఏకంగా 12 స్థానాలకు పైగా మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement