
ఉప్పల్లో ఐపీఎల్ జోష్
ఉప్పల్లో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండే స్టేడియం పరిసర ప్రాంతాలలో
ఉప్పల్ : ఉప్పల్లో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండే స్టేడియం పరిసర ప్రాంతాలలో అభిమానుల సందడి పెరిగింది. మొదటి రోజు కావడంతో క్రీడాభిమానులు ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని సైతం ఆస్వాదించడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం మధ్యాహ్నం 3 గంటల నుండే అభిమానులు బారులు తీరారు.
ట్రాఫిక్ దిగ్బంధంలోఉప్పల్ రోడ్డు..
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కు అభిమానుల తాకిడి పెరగగంతో బుధవారం 4 గంటల నుండే ఉప్పల్ రూట్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. 5 గంటల వరకు ఎక్కడికక్కడ స్తంభించింది. తార్నాక, మెట్టుగూడ వరకు అటువైపు ఉప్పల్, నాగోల్ వరకు ఉప్పల్ నల్ల చెరువు వరకు నలుదిక్కులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ విభాగం అధికారులంతా స్టేడియం బందోబస్తులో ఉండటంతో అదుపు చేసే వారు లేక సుమారు 4 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఉప్పల్ నుండి తార్నాక వెళ్లే వారు చిలుకానగర్ మీదుగా నాచారం చౌరస్తా, హబ్సిగూడకు చేరుకోవడం కనిపించింది.
ఐపీఎల్ మానియా
సోమాజిగూడ: ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో నగరంలో క్రికెట్ అభిమానుల ఉత్సాహం పెరిగిపోతోంది. బేగంపేట గ్రాండ్ కాకతీయ హోటల్లో బస చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లను చూసేందుకు పలువురు అభిమానులు సాయంత్రం హోటల్ ఎదురుగా పడిగాపులు కాయడంతో ఇక్కడ సందడి నెలకొంది. యూసుఫ్గూడకు చెందిన ఓ అభిమాని ఐపీఎల్ పేరు వచ్చేలా గుండు గీయించుకొని తన ప్రత్యేకత చాటుకున్నాడు.