మార్చి 29 నుంచి ఐపీఎల్‌

IPL 2020 mathes Starts From March 29 - Sakshi

తొలి మ్యాచ్‌లో చెన్నైతో ముంబై ‘ఢీ’ 

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్‌ మ్యాచ్‌ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. మే 17న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అయితే ఫైనల్‌ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది. గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్‌ హెడర్‌’ మ్యాచ్‌ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను బాగా తగ్గించారు.

ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్‌ హెడర్‌లు జరుగుతాయి. దాంతో లీగ్‌ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్‌ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్‌ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్‌ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్‌ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్‌ క్రికెట్‌ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది.  

ఏప్రిల్‌ 1 నుంచి హైదరాబాద్‌లో...: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తమ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్‌ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్‌ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్‌ తమ మ్యాచ్‌లు ఆడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top