ప్రతీకారం తీర్చుకుంటారా?
కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన నేటి మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. రిషబ్ పంత్ స్థానంలో రాహుల్ను జట్టులో తీసుకున్నారు.
ఈ సిరీస్లో మూడు జట్లు ఒక్కో గెలుపోటములతో ఉండటంతో అందరిని ఫైనల్ బెర్తు ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో రన్రేట్పైనో, మరో జట్టు జయాప జయాలతోనో సంబంధం లేకుండా... తమ శక్తిసామర్థ్యాలతోనే టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే సోమవారం జరిగే మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిందే.
ఈ ముక్కోణపు టి20 టోర్నీలో ఇప్పటి వరకైతే భారత్ బ్యాటింగ్ ఫర్వాలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్తో పాటు, నిలకడలేని బౌలింగ్ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు పడటంతో చండిమాల్ స్థానంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు. ట్రై సిరీస్ ఆరంభ మ్యాచ్ లో టీమిండియాకు శ్రీలంక షాకిచ్చింది. ఈ తరుణంలో శ్రీలంకపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలగా ఉంది.