
డ్రాగానే ముగిసింది..
ఆస్ట్రేలియాతో్ ఇక్కడ జరిగిన మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యంలో నిలవాలని భావించిన భారత క్రికెట్ జట్టు డ్రాతోనే సరిపెట్టుకుంది.
రాంచీ:ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయకమైన ఆటన ప్రదర్శించి భారత్ విజయాన్ని అడ్డుకుంది. ప్రధానంగా హ్యాండ్ స్కాంబ్(68 నాటౌట్; 194 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(53;197 బంతుల్లో 7 ఫోర్లు)లు బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ ను డ్రా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ 124 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం.
అంతకుముందు 23/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ 63 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ స్కోరు 59 పరుగుల వద్ద రెన్ షా(15) ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. దాంతో ఆసీస్ మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(21) అవుటయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 30 ఓవర్ తొలి బంతికి స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా సంధించిన బంతి గింగిరాలు తిరుగుతూ వచ్చి స్మిత్ వికెట్లను ఎగరేసుకుపోయింది.
ఆ తరుణంలో షాన్ మార్ష్-హ్యాండ్ స్కాంబ్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. సుమారు రెండు సెషన్లు హ్యాండ్ స్కాంబ్-షాన్ మార్ష్లు భారత్ బౌలింగ్ కు అడ్డంగా నిలబడ్డారు. ఒకవైపు స్పిన్ బౌలింగ్ వారిని ఇబ్బంది పెడుతున్నా మొక్కువోని దీక్షతో పోరాటం సాగించారు. ఈ క్రమంలోనే తొలుత హ్యాండ్ స్కాంబ్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తరువాత షాన్ మార్ష్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే మ్యాచ్ ఇంకా పది ఓవర్లలో ముగుస్తుందనగా షాన్ మార్ష్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో మ్యాక్స్ వెల్(2)ను అశ్విన్ అవుట్ చేశాడు. కాగా, అప్పటికే ఫలితం పై ఆశలు వదులుకున్న భారత్ కేవలం కట్టుదిట్టంగా మాత్రమే బౌలింగ్ చేసింది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి హ్యాండ్ స్కాంబ్ కు జతగా వేడ్(9 నాటౌట్) క్రీజ్ లో నిలిచాడు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, అశ్విన్లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుతం ఇరు జట్లు తలో టెస్టు గెలిచి సిరీస్ లో 1-1తో సమంగా నిలిచాయి. సిరీస్ లో చివరిదైన నాల్గో టెస్టు మార్చి 25వ తేదీన ధర్మశాలలో ఆరంభం కానుంది.