‘హ్యాట్సాఫ్‌ గంభీర్‌.. నువ్వేంటో మరోసారి నిరూపించావ్‌’

Gambhir Requested External Affairs Minister To Help The Pakistan Girl - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్‌ రావడానికి వీసా వచ్చేలా చేశారు. పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే ఆరేళ్ల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని గంభీర్‌ తెలుసుకున్నాడు. దీంతో ఆ చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు భారత్‌ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను గంభీర్‌ కోరారు. గంభీర్‌ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి స్పందించారు. 

చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులకు వీసాలు జారీ చేయాలని పాక్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. అనంతరం వారికి వీసాలు జారీ చేసినట్లు గంభీర్‌కు లేఖ రాశారు.  ఆ లేఖను గంభీర్‌ తన  ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. పాక్‌ చిన్నారి భారత్‌కు రావడమనేది ఒక బిడ్డ తన పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తోంది. భారత్‌కు వస్తున్న పాక్‌ చిన్నారికి స్వాగతం.’అని పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి వేగంగా స్పందించి వారికి వీసా వచ్చేలా చేసిన  విదేశాంగ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

అంతేకాకుండా ‘ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ ప్రభుత్వానికి నేను వ్యతిరేకినని కానీ పాకిస్తాన్‌ ప్రజలపై కాదు. ఇంకా లోకం అంటే తెలియని చిన్నారి భారత్‌లో వైద్యం అందుకుని ప్రాణాలు దక్కించుకుంటే అంతకంటే ఆనందమేముంటుంది’అని మరొక ట్వీట్‌ చేశారు. ఇక పాక్‌ చిన్నారి వైద్యం కోసం చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘క్రికెటర్‌గానే కాదు.. గొప్ప మానవతావదిగా మరోసారి నిరూపించుకున్నావ్‌’, ‘హ్యాట్సాఫ్‌ గంభీర్‌.. నువ్వేంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేశావ్‌’అంటూ నెటిజన్లు గంభీర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top