
చండీగఢ్: భారత మహిళల టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం నుంచి తప్పించారు. ఆమె డిగ్రీ పట్టభద్రురాలు కాదని, అమె సమర్పించిన సర్టిఫికెట్ నకిలీదని తేలడంతో పంజాబ్ పోలీస్ శాఖ డీఎస్పీ ఉద్యోగం నుంచి తొలగించింది. అమె 12వ తరగతి వరకే చదవడంతో హర్మన్ప్రీత్ విద్యార్హతకు తగిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశముంది. కాగా ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని పోలీస్ శాఖ ప్రకటించడం పెద్ద ఊరటనిచ్చే విషయం.
లేదంటే ఈ అర్జున అవార్డీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. గతంలో హర్మన్కు రైల్వే శాఖ ఉద్యోగమిచ్చింది. సొంత రాష్ట్రం పంజాబ్ నుంచి డీఎస్పీ ఉద్యోగ అవకాశం రావడంతో రైల్వే జాబ్కు రాజీనామా చేసి ఈ ఏడాది మార్చిలో డీఎస్పీగా చేరింది. ఆ సమయంలో మీరట్లోని చౌదరి చరణ్సింగ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినట్లు సర్టిఫికెట్ దాఖలు చేసింది. పోలీస్ శాఖ విచారణలో ఆమె సర్టిఫికెట్ నకిలీదని, ఆ వర్సిటీలో ఆమె చదవలేదని తేలింది. సరిగ్గా ఇలాంటి ఉదంతమే ఫిబ్రవరిలోనూ జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత, అథ్లెట్ మన్దీప్ కౌర్ నకిలీ పట్టాతో డీఎస్పీగా చేరడంతో తర్వాత తొలగించారు.