‘టీమిండియాతో సిరీసే చివరిది’
మాంచెస్టర్: ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబర్లో స్వదేశంలో భారత్తో జరిగే ద్వైపాక్షిక సిరీసే తనకు చివరిదని వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. ప్రపంచకప్లో భాగంగా గురువారం భారత్తో వెస్టిండీస్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం గేల్ మీడియాతో మాట్లాడాడు. 39 ఏళ్ల గేల్ వరల్డ్కప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు ఇంతకుముందే ఒకసారి ప్రకటించాడు. అయితే, తాజాగా తన నిర్ణయాన్ని మరింత కొంత సమయం పొడిగించాడు.
‘ఇక్కడితో అయిపోలేదు. నేను ఆడాల్సిన క్రికెట్ ఇంకా కొంత మిగిలే ఉంది. బహుశా మరొక్క సిరీస్ కావచ్చు. ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో భారత్తో జరిగే టెస్ట్ సిరీస్లో కచ్చితంగా ఆడతా. అలాగే వన్డే సిరీస్ కూడా. కానీ టీ20ల్లో ఆడను. ఇదే ప్రపంచకప్ తర్వాత నా ప్రణాళిక. చివరి మ్యాచ్ నా ప్రియ జట్టు టీమిండియాతోనే ఆడాలని అనుకుంటున్నా’ అని గేల్ పేర్కొన్నాడు. గేల్ ప్రకటనను విండీస్ క్రికెట్ జట్టు మేనేజర్ ఫిలిప్ స్పూనర్ బలపరిచాడు. విండీస్లో భారత్తో సిరీసే గేల్కు చివరిదని స్పష్టం చేశాడు. (చదవండి: గుర్తుపెట్టుకోండి.. అతడే ప్రపంచకప్ హీరో)
కాగా, ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆగస్ట్ 3 నుంచి విండీస్లో భారత పర్యటన మొదలవుతుంది. భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్లు విండీస్తో ఆడుతుంది. విండీస్ తరఫున గేల్ ఇప్పటివరకూ 103 టెస్ట్లు ఆడి 42.19 సగటుతో 7,215 పరుగులు చేశాడు. అలాగే 294 వన్డేల్లో 10,345, 58 టీ20ల్లో 1,627 పరుగులు చేశాడు.