మన క్రికెటర్లు అవగాహనాపరులు
బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్
న్యూఢిల్లీ: బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు, బుకీల సంప్రదింపులపై భారత క్రికెటర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ అన్నారు. ఈ అంశంపై వారికి తగినంత అవగాహన ఉందని పేర్కొన్నారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే తమకు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. ‘సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ద్వారా బుకీలు ఎలా సంప్రదింపులు జరుపుతారనే అంశంపై మన క్రికెటర్లకు పూర్తిగా అవగాహన కల్పించాం. వారికి నేరం జరిగే తీరుపై అవగాహన ఉంది. ఎవరైనా తమను సంప్రదించినప్పుడు వారు వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. మా ఏసీయూ టీమ్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల సోషల్ మీడి యా అకౌంట్లపై, ఆన్లైన్ కాంటాక్ట్లపై కన్నేసి ఉంచుతుంది. ఫేక్ ఐడీలతో అభిమానులుగా చెలామణి అయ్యేవారి నిజస్వరూపం ఏదో ఒక సమయంలో బయటపడుతుంది’ అని అజిత్ వివరించారు.