57వ రోజు పాదయాత్ర డైరీ | ys jagan prajasankalpayatra dairy 57th day | Sakshi
Sakshi News home page

57వ రోజు పాదయాత్ర డైరీ

Jan 10 2018 2:39 AM | Updated on Jul 25 2018 5:02 PM

 ys jagan prajasankalpayatra dairy 57th day - Sakshi

57వ రోజు
09–01–2018, మంగళవారం
చిప్పారపల్లి శివారు,
చిత్తూరు జిల్లా. 

అసలే చలికాలం.. ఆపై ఉదయం నుంచి ఆకాశమంతా మబ్బులు పట్టినట్టే ఉంది.. భానుడి జాడే లేదు.. ఆ చలిగాలిలోనే పూతలపట్టు నియోజకవర్గం నుంచి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టాను. జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇదొకటి. సమస్యలు ఎన్నెన్నో. ఉన్న సమస్యలు చాలక, ఈ నాలుగేళ్లలో ఒక్క పనీ జరగక.. ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. దారికి ఇరువైపులా చెరకు, జామ, పూల తోటలు కనిపించాయి. కానీ పండించిన రైతన్నలకు మాత్రం కష్టాలు తప్పడంలేదు. పంటను సరైన ధరకు అమ్ముకునే వీలు లేదు, నిల్వ చేసుకునే వెసులుబాటూ లేదు. పంట చేతికొచ్చాక చచ్చినట్టు దళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సిందే. అందుకే ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల బతుకులు అంతలా నీరసించి కనిపిస్తున్నాయి. చెరకు అంటేనే తీపికి ప్రతీక. ఆ రైతులది మాత్రం.. నష్టాల కష్టాల చేదును దిగమింగుతూ మనకు తీపిని పంచే తాపత్రయం.

భోజన విరామానికి ముందు మాణిక్యరాయపల్లి వద్ద కాలికి కట్టు కట్టుకుని కుంటుతూ.. చేతిలో చెరకు రసం, నల్లని బెల్లంతో ఓ రైతన్న వచ్చాడు. ఏమైందీ.. అని అడిగాను. ‘అన్నా.. పొలంలో పనిచేసుకుంటుంటే కాలికి గాయమైంది. దాంతో జ్వరం వస్తోంది. అయినా నీకు నా కష్టం చెప్పుకోవాలని వచ్చాను’ అన్నాడు. ఆ రైతన్న చెప్పిన కష్టానికి, ఆరోగ్యం సహకరించకున్నా నాతో చెప్పుకోవాలన్న తపనకు, నాపై ఉంచిన నమ్మకానికి గుండె బరువెక్కింది. వారి కుటుంబ సభ్యులంతా సంవత్సర కాలం కష్టపడి.. బెల్లం తయారు చేసి.. అమ్ముకుందామనుకుంటే గిట్టుబాటు ధర లేదట. అమ్మినా ఆ వచ్చే డబ్బు.. తెచ్చిన అప్పులకు, వడ్డీలకే సరిపోదట. పోనీ చక్కెర ఫ్యాక్టరీలకు చెరకు అమ్ముదామంటే.. అది మరింత దారుణం. అన్నీ ప్రైవేటు చక్కెర కర్మాగారాలే. వారు విదిలించే రేటుకే పంటను కట్టబెట్టాలి. దానికన్నా బెల్లం తయారీయే నయం. కానీ చంద్రబాబు ఇక్కడ పండే బెల్లంపై నల్ల బెల్లం అనే ముద్ర వేసి, ఆంక్షలు విధించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలకే అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాడు. ప్రభుత్వం సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయించి, చెరకు రైతుల వెన్ను విరుస్తోంది. 

ఈ జిల్లాలో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమదారులదీ దాదాపు ఇలాంటి వ్యథే. బాబు గారు ముఖ్యమంత్రి కాగానే గ్రానైట్‌పై రాయల్టీని, కరెంటు చార్జీలను విపరీతంగా పెంచాడు. దాంతో ఈ పరిశ్రమలన్నీ నష్టాల బాట పట్టాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలో మాత్రం రాయల్టీని వెయ్యి రూపాయలు తగ్గించాడు. దీంతో అక్కడ ఆయన బినామీలు, అనుయాయులైన గ్రానైట్‌ వ్యాపారులు బాగా లబ్ధి పొందుతున్నారు. మిగతా ప్రాంతాల్లోని గ్రానైట్‌ వ్యాపారులు అదే రేటుకు అమ్ముకుంటే వారికి గిట్టుబాటు కాదు. పోనీ రేటు పెంచుదామనుకుంటే మార్కెట్‌ ఉండదు.. విధిలేక పరిశ్రమలను మూసివేసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి. ఎంత దారుణం!

చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు అనూహ్యంగా రాయితీలు, సడలింపులు ఇవ్వడం సబబేనా? మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు ఏం పాపం చేశాయి? ఎందుకీ వివక్ష? అధికారం ఉందికదా అని ప్రభుత్వ వ్యవస్థలను మీ అనుయాయులకు, మీ బినామీలకు లబ్ధి చేకూర్చేలా మలచుకోవడం ఎంత వరకు సమంజసం? ఇదేనా మీ పారదర్శకమైన సుపరిపాలన?

పెనుమూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌.జగన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement