ఏ పార్టీతో పొత్తు ఉండదు : వైఎస్‌ జగన్‌

YS Jagan Special Interview Starts - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

పాదయాత్రలో ఎదురైన అనేక అనుభవాలతో పాటు రాజకీయాలు, తానిచ్చిన హామీలు, అధికార పార్టీ వైఫల్యాల వంటి అనేక విషయాలెన్నింటినో ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంలోని ఆంతర్యాన్ని  విడమరిచి చెప్పారు. చంద్రబాబు నాయుడు చవకబారు రాజకీయాలను ఎండగట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రత్యేకహోదా విషయంలో మాటమార్చడం, నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి అధికారం పంచుకుని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తో కలిసి కాపురం చేయడం వంటి చంద్రబాబు ద్వంద వైఖరులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఏపీలో చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు.

ప్రస్తుతం సాక్షి టీవీలో ప్రసారం అవుతున్న ఈ స్పెషల్‌ ఇంటర్వ్యూ కోసం ఇక్క డ క్లిక్‌ చేయండి. లైవ్‌.. వైఎస్‌ జగన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ..

స్పెషల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
అందుకే అసెంబ్లీ బహిష్కరించాం.. 
‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం.

అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్‌తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగన్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్‌ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతో జతకట్టిన చంద్రబాబు.. వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు అని మా పై విమర్శలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం రాలేదు.  కానీ వడ్డీలు కట్టమని నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు. 

కేసీఆర్‌ ముందుకు రావడం హర్షణీయం..
ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. ఇక ఏపీలో ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసింది. హోదా ఇవ్వగలిగే స్థానంలో ఉండి ఇవ్వకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా కేసీఆర్‌ మాట్లాడిన దానిని స్వాగతించాలి. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ముందుకు రావడం హర్షణీయం. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలతో పోరాటం చేసి కేసీఆర్‌ గెలిచారు. గత ఐదేళ్లలో కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీతో ఎక్కడా సంసారం చేయలేదు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని.. కలిసి పోటీ చేద్దామని కేటీఆర్‌తో చంద్రబాబు మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఒప్పుకున్నారు.

మేం ఎవరితో పొత్తు పెట్టుకోం..
చంద్రబాబుకు ఓటేయమని పవన్‌ కల్యాణ్‌ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు, బీజేపీ, పవన్‌ ముగ్గురికి పాత్ర ఉంది. మేం గతంలో ఎవరితోను పొత్తు పెట్టుకోలేదు.. ఈ సారి కూడా ఎవరితోను పొత్తు పెట్టుకోము. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం ఉంది. ఇప్పటికీ చాలాసార్లు మోసపోయాం. నేను ఏపీ ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇస్తాం.. ఇస్తాం.. అని చెప్పి చాలా మంది మోసం చేశారు. కాంగ్రెస్‌ చేస్తామని చేయలేదు.. పవన్‌, మోదీ వచ్చి అదే మోసం చేశారు. అందుకే ఏపీ ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే స్థితిలో లేరు. 25 మంది ఎంపీలను మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ఎవరు హోదాకు సంతకం పెడతారో వారికే మద్దతిస్తాం. 

హామీలు నెరవేర్చకపోతే.. రాజీనామా చేస్తా..
ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. రైతు రుణమాఫీని సమర్ధించను అని ఎప్పుడు చెప్పను. రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా సంతోషించేది నేనే. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా. పాదయాత్ర మొదలు పెట్టక ముందే.. రైతు భరోసా గురించి చెప్పాను. ప్రతి రైతు కుటుంబానికి మే నెలలో రూ.12,500 ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు చొప్పున ఇస్తాం. మన రాష్ట్రంలో చిన్న కమతాలు ఉన్న రైతులే ఎక్కువ. అందుకే రైతు భరోసా రైతు కుటుంబాన్ని ఒక యునిట్‌గా తీసుకున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని.. చంద్రబాబు తన హెరిటేజ్‌ ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. నాలుగేళ్లు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా.. చంద్రబాబు పొగుడుతూ వచ్చారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నా.. మన భాగస్వామియే కదా అని మోదీ వదిలేశారు.’ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top