గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?
సాక్షి, అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించారని ట్విటర్ వేదికగా విమర్శించారు. చంద్రబాబు రాక్షసపాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అంగన్వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం, వారిపై బెదిరింపులకు పాల్పడటం వల్లనే చంద్రబాబు కుర్చీ నుంచి జారిపడ్డారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మీ రాక్షస పాలనలో ఉద్యోగులుకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు చంద్రబాబు గారూ? అంగన్ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా? అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడిచేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 30, 2019
బందరు పోర్టును వేరే రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారు..
బందరు పోర్టుపై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని తెలంగాణ నుంచి పారిపోయి వచ్చింది ఎవరని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి.. భంగపడింది మీరు కాదా అంటూ చంద్రబాబును నిలదీశారు. ప్రతి దానిపై ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించవద్దన్నారు.
లోకేశ్.. చంద్రబాబు నీపై ఆశలు పెట్టుకున్నాడు
ట్విటర్లో లోకేశ్ పెడుతున్న పోస్ట్లకు విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఆ ట్వీట్లు ఏమిటని లోకేశ్ను ప్రశ్నించారు. చంద్రబాబు లోకేశ్పై చాలా ఆశలు పెట్టుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో రూ. 3,800 కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని.. నాలుగేళ్లలో రూ. 8వేల కోట్లు దాటించిందని తెలిపారు. జనాలతో ఫుల్గా తాగించి ఆదాయాన్ని పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది చంద్రబాబు కాదా అని లోకేశ్ను నిలదీశారు.