తాడేపల్లి : అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎత్తుగడ అని సజ్జల ధ్వజమెత్తారు. అమరావతి కోసం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టడంపై సజ్జల అనేక ప్రశ్నలు సంధించారు.
అమరావతి పేరిట అవినీతి నుంచి, రైతులకు పరిష్కారం కాని అంశాలనుంచి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? , ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరు అడ్డంకులు చెప్పారన్న దానికి చంద్రబాబు వివరణ ఇవ్వాలి: అసెంబ్లీలో తీర్మానం చేసి, అంతా చేసేశానని చంద్రబాబు చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అసెంబ్లీతో పాటు, మండలిని కూడా సమావేశపరచాలి కదా?, కానీ, అమరావతి లో చంద్రబాబు అవినీతి, వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తారనే మండలిని పిలవటం లేదా?, రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్మించి, ప్రజలకు వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు, అలాకాకుండా రాజధాని అంశాన్ని శాశ్వత కామధేనువుగా మార్చాడు, అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారు’ అని సజ్జల మండిపడ్డారు
రాష్ట్రాన్ని సమిధలా మారుస్తున్నారు
రాజధాని విషయంలో చంద్రబాబుకు ఆచరాణాత్మక ధోరణి ఇప్పటికీ లేదు. వైఎస్సార్సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతికీ స్థానం ఉంది, అయితే ఇదంతా గతంలో జరిగిన పరిణామాలు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, వచ్చాక కూడా ఏమీ చేయడం లేదు. చంద్రబాబు ఊహాజనిత రాజధాని, దానికయ్యే ఖర్చు ఎంత అవుతుంది అన్నదానిపై మేం ప్రశ్నలు వేశాం. అంతే తప్ప అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ జగన్ వ్యతిరేకం కాదు. అందుకనే 2019లో అధికారంలోకి రాకముందే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అమరావతి ప్రాంతానికి వైఎస్సార్సీపీ ఆ రోజూకాని, ఈ రోజుకాని ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. మేం అభ్యంతరం వ్యక్తం చేసేది అవినీతి మీద, దోపిడీ మీద. రైతుల సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేదు. పిల్లల పెళ్లిళ్లు కూడా రైతులు చేయలేకపోతున్నారు.
చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. 2014-19లో ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5వేల కోట్లే. ఇప్పుడు కూడా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు చదరపు అడుగుకు రూ.19వేల వరకూ పెంచారు. అమరావతిలో పాత బిల్డింగులు కాక, ఈ రెండేళ్లలో కొత్తగా కట్టారా?, మళ్లీ డిజైన్ల పేరిట రూ.400 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 2018లో టెండర్లు ఖరారై, పనులు ప్రాంభమైన వాటికి కూడా మళ్లీ టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లతో గూడు పుఠానీ చేశారు. అందరికీ 4% కంటే ఎక్కువ టెండర్లు ఖర్చు పెట్టారు.
అసలు కట్టాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా?
చంద్రబాబు తీరును చూసి, అమరావతి పేరిట చేసిన దోపిడీని చూసి రాష్ట్రం భయపడతోంది. చంద్రబాబు సృష్టించిన అవినీతి ఊబిలో రాష్ట్రం ఎక్కడకు పోతుందో తెలియడంలేదు. ప్రజల సొమ్ము, రాష్ట్ర వనరులను పీల్చి పిప్పిచేస్తున్నారు. ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును చీకట్లో పెడుతున్నారు. అమరావతి గురించి ఆర్టీఐ కింద ప్రశ్నలు వేసినా సమాచారం ఇవ్వడంలేదు. అమరావతి పనుల్లో ఎక్కడా పారదర్శకత లేదు. ఈ విడతలో రూ.9వేలకోట్లు తెచ్చి, రూ.5వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చారు. సుమారు 47వేల కోట్లకు శాంక్షన్లు ఇచ్చారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అమరావతికి వ్యతిరేకం అని ముద్ర వేస్తున్నారు. అమరావతి ఏపీలో భాగం కాదా. అమరావతిలో మా పార్టీకి ఓట్లు రాలేదా?
పాత బిల్డింగులు తప్ప.. కొత్తగా చంద్రబాబు ఏం కట్టాడు?
రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీకోసం ఏమైనా చేశారా?, ఇప్పటికీ కరకట్ట రోడ్డే కదా గతి. వచ్చినా వెస్ట్రన్ బైపాస్ కూడా పూర్తిచేసింది వైఎస్సార్సీపీ హయాంలోనే కదా. పనులు ఏమీ చేయకపోయినా, ప్రజలను నిరంతరం భ్రమల్లో పెట్టాలన్నదే చంద్రబాబు ప్లాన్. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ అమరావతి విషయంలో వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా?, మొదటి విడత భూములు తీసుకున్న రైతులకే ఏమీ చేయలేదు. కాని, రెండో విడత అంటూ మళ్లీ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతిలో జోరుగా జరుగుతున్న పనులు కేవలం చంద్రబాబు ఇల్లు మాత్రమే. అమరావతి పేరుమీ అప్పులు తెస్తున్నారు, మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారు, కమీషన్లు కొట్టేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు?, దీనికి ఎవరు అడ్డుపడ్డారు.
చెరువుల్లో కూడా రైతులకు ప్లాట్లు ఇచ్చి వారిని నట్టేటా ముంచారు. ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే.. మళ్లీ వారిమీద ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇన్కంట్యాక్స్ నోటీసులు అమరావతి పనుల కమీషన్లకు సంబంధించే వచ్చాయి. రూ.2వేల కోట్ల అవినీతిపై ఆరోజు ఇన్కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు కమీషన్లు, లంచాలు వెళ్లాయని ఆ నోటీసుల్లో ఉంది. ఈ నోటీసులపై విచారణ ఆగిపోయింది. అమరావతిలో చంద్రబాబు అవినీతికి నిదర్శనానికి ఈ నోటీసులే. అమరావతి నిర్మాణాలు, అంచనాలు, అప్పులు చూస్తే ప్రజల గుండెలు అదిరిపోతున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూనే అప్పులు చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఎలా అవుతుందో చంద్రబాబు వివరించగలరా?, వీటికి సమాధానాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందుకే అసెంబ్లీ తీర్మానం పేరిట డ్రామా.
పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టుకోవడానికే ఈ డ్రామా
ఒక భ్రమను ప్రజలకు కల్పించడానికే ఈ డ్రామా. అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. అమరావతిలో చంద్రబాబు. కట్టాలనుకుంటున్న భవనాల నిర్వహణ ఖర్చులు వింటేనే ప్రజలకు భయం వేస్తోంది. ఆచరాణాత్మకంగా, వాస్తవిక దృక్పథంతో చంద్రబాబు ఆలోచన లేదు. పనులు కన్నా, భ్రమలను కలిగిండచమే చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు గతంలో చెప్పిన హైపర్ లూప్ ఏమయ్యింది?, అమరావతిలో ఒలింపిక్స్ ఏమయ్యాయి?’ అని సజ్జల ప్రశ్నించారు.


