కువైట్‌లో రాష్ట్రవాసుల కష్టాలు తీర్చండి

telangana people struck IN kuwait - Sakshi

దాసోజు శ్రవణ్‌ కుమార్‌ డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: కువైట్‌లో తెలంగాణవాసులు 50వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దేశ అంబాసిడర్‌ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్‌ చెప్పారు. సొంత దేశానికి వచ్చేందుకు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని భారత్‌కు రప్పించాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కువైట్‌కు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించాలని, ప్రభుత్వ ఖర్చులతోనే బాధితులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు.

కువైట్‌ నుంచి వచ్చినవారికి ప్రభుత్వం ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి తమ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్‌ ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్‌ పర్యటనలన్నీ జల్సాలకు, బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నారై పాలసీ రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్‌ బాధితుల సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని, రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్‌ బాధితులకు సాయం అందించేందుకు టీపీసీసీ నుంచి ఓ బృందం గల్ఫ్‌ వెళ్లనుందని, వారి బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top