దేశంలో అతిపిన్న వయసున్న మంత్రిని నేనే | nara lokesh in prakasam district tour | Sakshi
Sakshi News home page

దేశంలో అతిపిన్న వయసున్న మంత్రిని నేనే

Oct 25 2017 12:15 PM | Updated on Aug 30 2019 8:37 PM

nara lokesh in prakasam district tour - Sakshi

పర్చూరు: భారతదేశంలో అతి తక్కువ వయసున్న మంత్రిని తానేని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. 34 ఏళ్ల వయసుకే తాను మంత్రి అవుతానని ఏనాడూ ఊహించలేదన్నారు. మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అనంతం లోకేష్‌ తొలిసారిగా మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మార్టూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్‌ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 794 కిలోమిటర్లు మేర సీసీ రోడ్లు వేశామన్నారు. జిల్లాలో వంద శాతం సీసీ రోడ్లు వేయాలంటే 1200 కిలోమీటర్లు వేయాలని 2019 నాటికి సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు.

చెత్త పేరుకుపోకుండా 2018 నాటికి రాష్ట్రంలోని 12,918 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు పూర్తి చేస్తామన్నారు. ఐదు వేల జనాభా వున్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. అంతకు ముందు ఆయన మార్టూరు మండలం కోనంకి గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఘన వ్యర్థాల నుంచి వర్మి కంపోస్టు యూనిట్‌ పరిశీలించారు.  గ్రామంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాల కోసం శంకుస్థాపన చేసి, లేఅవుట్‌ పత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుసాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అద్దంకి నియోజకవర్గ ంలో పర్యటించారు.

Advertisement
 
Advertisement
Advertisement