మాఫియాను పెంచి పోషిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
జనగామలో సీపీఐ పోరుబాట ప్రారంభం
సాక్షి, జనగామ: అందరు ఒక్కటై సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాఫియా సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. ‘సామాజిక తెలంగాణ–రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ పేరుతో సీపీఐ చేపట్టిన పోరుబాట శుక్రవారం జనగామ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైంది. కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల నుంచే రూ.40 వేల కోట్ల ఇసుకను తరలించుకుపోతున్నారని విమర్శించారు. నయీం మరణానంతరం ప్రభుత్వం చేపట్టిన విచారణ నామమాత్రంగానే మారిందన్నారు. నయీం, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించిన భూములపైకి వెళ్తామన్నారు.
విభజన చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో ముందుగా ఆత్మహత్య చేసుకున్న రైతులు, తెలంగాణ అమరవీరులకు నివాళిగా మౌనం పాటించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క పలువురు నేతలు పాల్గొన్నారు.