ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైంది

Jagadeesh Reddy Criticize On Congress In Nizamabad - Sakshi

ఆర్మూర్‌: ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ విఫలమైంద ని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలోని సాయి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బూత్‌ క మిటీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కవిత, టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి టి.ఉమతోపాటు ముఖ్య నాయకులంతా తెలంగాణ అమర వీరుల కు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూ పించడానికి బలమైన ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయపడతారన్నారు. కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ అవినీతిని, పార్టీ ఫిరాయింపులను, చట్టాలకు తూట్లు పొడవడాన్ని నేర్పించిందని ఆరోపించారు.

నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల్లో, రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటే నని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకొనే కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలతో దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో లాగ పథకాలను అమలు చేస్తామంటూ తెలంగాణ రాష్ట్రం పేరును ప్రస్తావించే స్థాయికి చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

ఇటీవల ఆర్మూర్‌కు వచ్చిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఫరీదొద్దిన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.38కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 48 వేల మంది కార్యకర్తలతోపాటు రాష్ట్రంలో 75 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామన్నారు.

అనంతరం ఎంపీ కవిత ఆర్మూర్‌ పట్టణ, మండల బూత్‌ కమిటీ అధ్యక్షులనే పేరు పేరునా ప్రస్తావిస్తూ వారికి దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మధుశేఖర్, రాజేశ్వర్, విఠల్‌రావు, ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు సాందన్న, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లింగాగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, నాయకులు గంగాధర్, లింగారెడ్డి, భాస్కర్, గంగామోహన్‌ చక్రు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top