
‘వారసులు’ శివాజీని మరిచారా?
ప్రజలు గొప్ప కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఔరంగజేబు చక్రవర్తి 1679లో జిజియా పన్నును విధించాడు. దీన్ని నిరసిస్తూ శివాజీ ఆయనకు ఓ లేఖను పంపాడు.
ప్రజలు గొప్ప కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఔరంగజేబు చక్రవర్తి 1679లో జిజియా పన్నును విధించాడు. దీన్ని నిరసిస్తూ శివాజీ ఆయనకు ఓ లేఖను పంపాడు. ప్రముఖ చరిత్రకారుడు సర్ జాదూనాథ్ సర్కార్ దాన్ని నమోదు చేశారు. ఔరంగజేబు పూర్వీకులు అక్బర్, జహంగీర్, షాజహాన్లకు సైతం ముస్లిమేతరుల పట్ల వివక్షను చూపే ఆ పన్ను వసూలు అధికారం ఉండేది. ‘‘అయినా వివిధ మతాలకు, ప్రవృత్తులకు ఉదాహరణగా మనుషులందరిని, ఎక్కువ తక్కువలను భగవంతుడే సృష్టించాడని వారు విశ్వసించారు. కాబట్టే మత దురభిమానానికి వారు తమ హృదయాల్లో తావివ్వలేదు.’’ అల్లాను ఖురాన్ ‘‘రబ్ అల్ ముసల్మాన్ (ముస్లింలకు మాత్రమే దేవుడు)అనడానికి బదులుగా రబ్ అల్ అలామిన్, మానవులందరికి దేవుడు అంది... ఏ మనిషి మతం లేదా మతాచారాల పట్ల మత దురభిమానాన్ని ప్రదర్శించడమంటే పవిత్ర గ్రంథంలోని మాటలను మార్చడంతో సమానం....’’ అని శివాజీ గుర్తుంచుకోదగిన రీతిలో మందలించారు. ముఖ్యమైన ఈ లేఖను గురించి జాదూనాథ్ తన ‘శివాజీ అండ్ హిస్ టైమ్స్,’ ‘హిస్టరీ ఆఫ్ ఔరంగజేబు’(మూడవ సంపుటి) గ్రంథాల్లో చర్చించారు.
ప్రతి మత విశ్వాసానికి సమాన గౌరవం ఇవ్వడం భారత నాగరికతకు మూల స్తంభం. ఈ సాధారణ నైతిక, సాంస్కృతిక వారసత్వమే మన రిపబ్లిక్కు శాశ్వత ప్రేరణ. 17వ శతాబ్దినాటి శివాజీ లేఖ 20వ శతాబ్దినాటి మన భారత రాజ్యాంగానికి ముందుమాటగా పనిచేస్తుంది.
హితోపదేశం చేయడం కాదుగదా ఉపన్యాసం దంచడం సైతం పత్రికలోని ఒక కాలంలో చేయాల్సిన పని కాదు. అయినా శివాజీ లేఖను గుర్తు చేయడం సముచితమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఒక ఎంపీ ఆగ్రహ ప్రకోపం కలుగజేసే ప్రభావం, ఒక చక్రవర్తి ప్రదర్శించే పక్షపాతంతో పోలిస్తే చిన్నదే. మహారాష్ట్రకు చెందిన కొందరు ఎంపీలు ప్రభుత్వ భోజనశాలలో అంగీకారయోగ్యం కాని భోజనాన్ని వడ్డించినందుకు హేతువిరుద్ధంగానూ, దాదాపు స్కూలు పిల్లాడి ఆకాయితనంతోనూ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది అపరిణత అపరాధమే తప్ప ప్రభుత్వ విధానం కాదు. అయినా గానీ మనం దాన్ని తీవ్రంగా పట్టించుకుని తీరాలి. భారత ప్రజాస్వామ్య సౌధం అసంఖ్యాకమైన వ్యక్తిగత, సమష్టి హక్కులతో నిర్మితమైంది. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లోని ముస్లిం సర్వర్ నోట్లోకి ఒక ఎంపీ చపాతీని కుక్కాలనుకున్న సందర్భంలో జరిగినట్టుగా... మతం ఒక మనిషి మొహం మీద రాసి ఉండేదేమీ కాదనేది నిజమే. అయితే మానవుని గౌరవమనే భాషను ఏ లిపిలో రాయాలి? శివాజీ తన మతంగా మార్చుకున్న (లౌకికవాద) లిపిలో కాదా? సంబంధిత ఎంపీ శివాజీ వారసత్వాన్ని స్వీకరించినవాడైనప్పుడు ప్రత్యేకించి ఈ ప్రశ్న సందర్భోచితమైనది అవుతుంది. మనం ఇప్పడు మాట్లాడుతున్నది ప్రత్యేకించి ఒక మతం తరఫున కాదు. అంతకంటే సువిశాలమైన పేదల సమూహం పట్ల ఆ ఎంపీ నిస్సిగ్గుగా తలపొగరుతనాన్ని ప్రదర్శించారు.
ప్రధాని నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనూ, లోక్సభలోని తొలి ప్రసంగంలోనూ మూడు మౌలికమైన విషయాలను నొక్కిచెప్పారు. మొట్టమొదటిది, పేదల కోసం పనిచేయడమే ప్రభుత్వం బాధ్యత. రెండవది మైనారిటీలు సహా భారతీయులందరికీ అభివృద్ధి, ఉద్యోగాలు అందాలి (శరీరంలోని ఒక అంగం బలహీనంగా ఉండిపోతే ఆ శరీరాన్ని ఆరోగ్యవంతమైనదని అనలేం. మేం దీనికి కట్టుబడి ఉన్నాం... దీన్ని మేం సంతృప్తి పరచడంగా చూడటం లేదు). ఇక మూడవది, స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీ ప్రజా ఉద్యమంగా మలచిన రీతిలోనే మనం అభివృద్ధిని కూడా ప్రజా ఉద్యమంగా మలచగలిగితేనే భారత్ రెండంకెల వృద్ధితో ఆధునిక దేశంగా మారగలుగుతుంది. బహిరంగ చర్చలోని చంచలత్వం ప్రభుత్వాన్ని ఆ విధానం నుంచి వైదొలగేలా చేసి, దానికి భిన్నమైన ైవె ఖరిని ప్రకటించేట్టు చేయగలుగుతుంది.
బహిరంగ చర్చలోని చంచలత అర్థం చేసుకోదగినది కాకపోయినా ఊహించదగినదే. ఎన్నికల ఫలితాలు ఒక భూకంపం. ఆ తదుపరి ప్రకంపనలు కొంతకాలం పాటూ ఇబ్బంది పెట్టక తప్పదు. ఫలితాలపై తమ అభిప్రాయాలకు సమంజసత్వాన్ని ఆపాదించుకునే వెలుపలి పరిధి ఒకటి ఉంటుంది. అవకాశవాదులు ఆ అంచును సంతోషపెట్టి ప్రయోజనాల పంపిణీలో ప్రతిఫలాలను దక్కించుకునే అవకాశాలను మెరుగుపరుచుకోగలమని ఊహిస్తుంటారు. సమ్మిళిత దృక్పథంతో మాత్రమే ఒక ప్రభుత్వం పనిచేయగలుగుతుంది. సదరు ఎంపీ ప్రవర్తన దురదృష్టకరమంటూ హోం మంత్రి రాజ్నాథ్సింగ్ అది అంగీకారయోగ్యంకాదని ధ్వనించి పార్లమెంటుకు నమ్మిక కలిగించగలిగారు.
ప్రకటిత విధానం నుంచి వైదొలగడంలో ఆచరణాత్మకమైన ప్రమాదాలున్నాయి. ఓటర్లు కూడా అస్థిరంగా మారవచ్చని రాజకీయవేత్తలకు అనుభవంలోకి రావచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో తమకు ఏమి వాగ్దానం చేశారో వాటిని అందించాలని వారు కోరుకుంటారు. అంతేగానీ వాటిని విస్మరించి హఠాత్తుగా మరో పాట అందుకోవడంలో వాళ్లు ఆసక్తిని చూపరు.
ఓటర్లు సిద్ధాంతవేత్తలు కారు. వారికి కావాల్సింది ఇళ్లు, విద్యుత్తు, నీరు, కూరగాయల ధరలు తగ్గడం. అది కూడా ఎప్పుడో కాదు, త్వరగా జరగడం కావాలి. వారి ఎన్నికల్లో తమకు నచ్చినవాళ్లను ఎంచుకునే విలాసవంతమైన అవకాశమూ ఉంది, పోటీలో ఉన్న వారిలో మిగతా అందరి కంటే వాటిని అందించగల సామర్థ్యంగల నాయకుడెవరో గుర్తించగల సామర్థ్యం కూడా ఉంది. రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయగలుతారు. అధికారంతో పాటు బాధ్యతలను కూడా మోయాల్సి ఉంటుంది. ఆ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మాత్రమే ఎవరికైనా గౌరవమూ, పేరు ప్రతిష్టలు వస్తాయి.
ఎడారిలాంటి గత కాలపు రాజకీయాలు, భాష, పరిపాలన ఇక గతించిపోయాయనే ఉత్సాహాన్ని నరేంద్ర మోడీ రేకెత్తించగలిగారు. తక్షణమే ఫలితాలు లభించాలని ఎవరూ ఆశించరు. లేదా పరివర్తన అంత సులువైనదని అనుకోరు. వారం లేదా పక్షం రోజుల పాటే అయినా మోడీ తెర వెనుకకు పోతే దేశం ఆయన గైరు హాజరీని గుర్తిస్తుంది. త్వరలోనే ఈ జూలై మాసపు కష్టాలు గడచిపోతాయి. ఆగస్టు నాటికి స్వచ్ఛమైన గాలులు వీయడం అవసరం.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్