కాబూల్‌ పేలుడు చెప్పిన నిజం | Kabul Bomb Blast tell the truth | Sakshi
Sakshi News home page

కాబూల్‌ పేలుడు చెప్పిన నిజం

Jun 3 2017 11:59 PM | Updated on Sep 5 2017 12:44 PM

కాబూల్‌ పేలుడు చెప్పిన నిజం

కాబూల్‌ పేలుడు చెప్పిన నిజం

తూర్పు అఫ్ఘానిస్తాన్‌లోని వార్దాక్‌ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరం దగ్గరకి ఒక ట్రక్కును తీసుకువచ్చారు.

అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత (9/11) జరిగిన ఒక దశాబ్దానికి, అంటే సెప్టెంబర్‌ 11, 2011న అఫ్ఘానిస్తాన్‌లో మరో ఘటన జరిగి, అందరి దృష్టిని ఆకర్షించింది. తూర్పు అఫ్ఘానిస్తాన్‌లోని వార్దాక్‌ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరం దగ్గరకి ఒక ట్రక్కును తీసుకువచ్చారు. మరుక్షణంలోనే భీకరమైన విస్ఫోటనం సంభవించింది. ఆ ట్రక్కు ఒక అగ్నిగోళంలా మారిపోయింది. పేలుడు పదార్థాలను నింపిన ఆ ట్రక్కు తునాతునకలైంది. అమెరికా సైనిక స్థావరం గోడ మొత్తం పగుళ్లు వారింది. ఒక డజను మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సంయుక్త రక్షణ దళ విభాగాల అధిపతులకు అధ్యక్షులుగా నాడు అడ్మిరల్‌ మైఖేల్‌ ‘మైక్‌’ములెన్‌ పనిచేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా అమెరికా రక్షణ బలగాలలో వివిధ హోదాలలో పనిచేసిన ములెన్‌ ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఆయనే వాషింగ్టన్‌ డీసీలో కాంగ్రెస్‌ సభ్యుల బృందం ముందు కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడే ఆయన చాలా నిష్కర్షగా ఈ విషయం చెప్పారు. ‘పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలి జెన్స్‌ (ఐఎస్‌ఐ) చేతిలో హఖానీ నెట్‌వర్క్‌ సంస్థ పలు రకాలుగా ఉపయోగపడే ఆయుధంగా మారిపోయింది’ అని ఆయన వెల్లడించారు.

దాడితో చెప్పదలుచుకున్న సంగతి
ఇటీవల కాబూల్‌లో అదే తరహాలో ట్రక్కు బాంబు పేలిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు ఉండే కూడలిలో ఈ ఘోర విస్ఫోటనం జరిగింది. ఈ పేలుడులో దాదాపు 90 మంది చనిపోయారు. కొన్ని వందలమంది గాయపడ్డారు. దీని వెనుక హఖానీ నెట్‌వర్క్‌ ఉందని సహజంగానే అంతా అనుమానించారు. నిజానికి ఈ పేలుడుకు బాధ్యత హఖానీ నెట్‌వర్క్‌దేనని అఫ్ఘానిస్తాన్‌ నిఘా సంస్థ నేషనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్‌) బాహాటంగానే ఆరోపించింది. పవిత్ర రంజాన్‌ మాసం మొదలుకావడానికి కొద్ది ముందే ఈ దుర్ఘటన జరిగింది. రంజాన్‌ మాసం సంగతితో పాటు, విస్ఫోటనం చేయడానికి బాధ్యులు ఎంచుకున్న సమయం, ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనవి. కాబూల్‌లో విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి కొన్ని గజాల దూరంలోనే జర్మనీ వారి దౌత్య కార్యాలయం ఉంది.

ఆ దాడిలో ఈ దౌత్య కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులు కూడా గాయపడ్డారు. కార్యాలయం గేటు దగ్గర ఉండే కాపలాదారు మరణించాడు. అక్కడ పనిచేసే ఏకైక కాబూల్‌ వాసి అతడొక్కడే. ఇక విస్ఫోటనం జరిగిన సమయం గురించి–మన ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెల్‌ మెర్కెల్‌తో కలసి తీవ్ర పదజాలంతో సంయుక్త ప్రకటన చేస్తున్న సమయంలో ఆ దుర్ఘటన జరిగింది. ‘‘ఆర్థిక ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారి పట్ల, ప్రోత్సహిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి’’ అని ప్రతిన తీసుకుంటున్న సమయంలో ఆ పేలుడు సంభవించింది. భవిష్యత్‌ తరాలు ఎదుర్కొనే ఏకైక తీవ్ర సమస్య ఉగ్రవాదమని మోదీ పేర్కొన్నారు. ‘ఈ సమస్యను మన రెండు దేశాలు కలసికట్టుగా ఎదుర్కొంటాయి, అందుకు సైబర్‌ రక్షణ, నిఘా వ్యవహారాలలో పరస్పర సహకారం అవసరమ’ని మోదీ స్పష్టం చేశారు.

పేలుడు యాదృచ్ఛికం కాదు
గడచిన కొన్నేళ్ల కాలంలో పారిస్‌ నుంచి మాంచెస్టర్‌ వరకు, ఐరోపా అంతటా ఉగ్రవాదులు పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అఫ్ఘానిస్తాన్‌లో అల్‌కాయిదా, తాలి బన్‌ల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ‘నాటో’సైన్యాలతో కలసి ఐరోపా దేశాలు కూడా పనిచేస్తున్నాయి. జర్మనీకి చెందిన 1,000 మంది సైనికులు కూడా అక్కడ వివిధ స్థాయిలలో రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబూల్‌లో జర్మనీ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన తాజా విస్ఫోటనం కేవలం యాదృచ్ఛిక ఘటనగా చెప్పే వీలులేదు. గత కొన్నేళ్లుగా జరిగిన విస్ఫోటనాలలో కాబూల్‌ తాజా పేలుడు ఘటన తీవ్రమైనది. అలాగే ఈ పేలుడు ఆఖరిదని చెప్పలేం. తాజా పేలుడు సంభవించిన తరువాత యథావి«ధిగా పాకిస్తాన్‌ ఈ చర్యను ఖండించింది.

అధ్యక్షుడు మామ్‌నూన్‌ హస్సేన్‌ పార్లమెంట్‌లో ఘాటు పదజాలంతో మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్‌లో శాంతిని నెలకొలపడానికి తీసుకునే అన్ని చర్యలకు పాక్‌ ప్రజలు, ప్రభుత్వ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని పేలుడు జరిగిన రోజునే ఆయన అన్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్టు చెబుతున్న హఖానీ నెట్‌వర్క్‌ రాజ పోషకురాలు పాకిస్తాన్‌ అన్న విషయంలో ఎవరికీ సందేహం ఉండదు. హఖానీ నెట్‌వర్క్‌ ప్రస్థానం చూస్తే అసలు ఆ సంస్థ ఎవరి సార థ్యంలో నడుస్తున్నదో కూడా అర్థంకానంత గోప్యత ఉంటుంది. ఆ సంస్థ నాయకుడు ఎవరో వాస్తవంగా ఎవరికీ తెలియదు.

పేరు ఎవరిదైనా నడిపేది పాక్‌
హఖానీ నెట్‌వర్క్‌ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? దీనిని పుష్తూన్‌ యుద్ధ ప్రభువు జలాలుద్దీన్‌ హఖానీ స్థాపించాడు. అఫ్ఘానిస్తాన్‌ మీద సోవియెట్‌ రష్యా దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ సంస్థ ఎదుగుదల, ఇంకా చెప్పాలంటే పుట్టుకలో కూడా సీఐఏ హస్తం ఉందని చెబుతారు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి సోవియెట్‌ రష్యా సేనలు వైదొలగిన తరువాత హఖానీ ఒక వైపు తాలిబన్‌లకు, మరోవైపు ఐఎస్‌ఐకు నాయకునిగా అవతరించాడు. ఉత్తర వజీరిస్తాన్‌ చేరుకుని, అటు పాక్, ఇటు అఫ్ఘాన్‌ సరిహద్దులలో తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడే మీరాన్‌షా దగ్గర తన ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పాడు. అయితే 2015లో బీబీసీ ప్రసారం చేసిన ఒక నివేదికలో హఖానీ సంవత్సరం క్రితమే (2014) మరణించాడని వెల్లడించింది. కొన్ని ఆధారాలను బట్టే బీబీసీ ఈ వార్తను వెల్లడించింది. ఇప్పుడు సిరాజుద్దీన్‌ హఖానీ ఆ సంస్థను నడుపుతున్నాడని చెబుతారు. ఇతడు కరుడుగట్టిన తాలిబన్‌ కమాండర్‌ స్థాయి కార్యకర్త. పేరుకు ఇతడు నాయకుడైనా వెనక ఉండి హఖానీ నెట్‌వర్క్‌ను ముందుకు నడిపిస్తున్నది మాత్రం ఐఎస్‌ఐ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు.

హఖానీ నెట్‌వర్క్‌ ముగుసులో ఐఎస్‌ఐ
అలాగే, హఖానీ నెట్‌వర్క్‌ వెనుక ఉన్నది పాకిస్తానేనంటూ మైక్‌ ములెన్‌ ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటన ఇచ్చారంటే అందుకు ఆయన వద్ద ఉన్న కొన్ని ఆధారాలే కారణం. అందుకు ఉపయోగపడిన ఆధారాలలో అఫ్ఘానిస్తాన్‌లో పనిచేస్తున్న మరో అమెరికా సైనిక కమాండర్‌ జనరల్‌ జాన్‌ అలెన్‌ ఇచ్చిన ఆధారం కూడా ఒకటి. పాకిస్తాన్‌–అఫ్ఘానిస్తాన్‌ సరిహద్దులలో అనుమానాస్పదంగా ట్రక్కు లు సంచరిస్తున్న విషయాన్ని పసిగట్టిన అమెరికా సైన్యం ఆ విషయాన్ని అప్పటి పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అష్పాక్‌ పర్వేజ్‌ కయానీ దృష్టికి తీసుకుని వెళ్లింది. ఎలాంటి ఉత్పాతం జరగకుండా నివారించడానికి ఫోన్‌ చేసి చెబుతాను అని కయానీ హామీ ఇవ్వడంతో అలెన్‌ నిర్ఘాంతపోయారు. అంటే పాకిస్తాన్‌ సైన్యానికి ఫోన్‌లో కూడా అందుబాటులో ఉన్న సంస్థ హఖానీ నెట్‌వర్క్‌. ఈ విషయం అలెన్‌కు అర్థమైంది.

అమెరికా గూఢచార సంస్థలు 2008 ప్రాంతంలో ఒక ఫోన్‌ సంభాషణను రహస్యంగా విన్నాయి. అందులోనే హఖానీ నెట్‌వర్క్‌ ఒక ‘వ్యూహాత్మక సంపద’ అని సాక్షాత్తు కయానీ చెప్పడం అమెరికా గూఢచారులు విన్నారు. నిజం చెప్పాలంటే అఫ్ఘానిస్తాన్‌లో అడ్డూ ఆపూ లేకుండా జరుగుతున్న రక్తపాతానికి మూలం, ఒకే ఒక్క కారణం ఐఎస్‌ఐ. ఇది తన కార్యకలాపాలను హఖానీ నెట్‌వర్క్‌ వంటి సంస్థలతో పరోక్షంగా నిర్వహిస్తున్నది.

దీనికి అంతం లేదా?
దీనికి అంతం ఎప్పుడు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అదే ప్రాంతానికి చెందిన మరో యుద్ధ ప్రభువు గురించి ముందు తెలుసుకోవాలి. ‘అతడు నిజమైన పుష్తూ జాతీయునిగా జీవించాడు, మరణించాడు’ అన్న అక్షరాలు ఒక మట్టి సమాధి మీద కనిపిస్తాయి. ఆ మసీదు దక్షిణ వజిరిస్తాన్‌లోని షాకెయ్‌లో కనిపిస్తుంది. ఆ మట్టి సమాధి కింద శాశ్వతంగా నిద్రపోతున్న వ్యక్తి పేరు నేక్‌ మహ్మద్‌. ఇతడు కూడా అఫ్ఘాన్‌లో తాలిబన్‌ల నాయకుడే. పాకిస్తాన్‌లోని వజీరిస్తాన్‌ గిరిజన ప్రాంతంలో తాలిబన్‌ కార్యకలాపాలకు తిరుగులేని నాయకుడుగా ఎదిగినవాడు. ఇతడు ఎంతగా ఎదిగాడంటే, ఎంత రక్తపాతం సృష్టించాడంటే పర్వేష్‌ ముషార్రఫ్‌ కూడా ఇతడితో సంధి చేసుకోవలసి వచ్చింది. అయితే ఆ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. తరువాత ఒక దశలో ఐఎస్‌ఐ, సీఐఏ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రిడేటర్‌ డ్రోన్లకు కొంత సమాచారాన్ని అందించడానికి ఐఎస్‌ఐ ఆమోదించింది. చివరికి 2004 జూన్‌ మధ్యలో నేక్‌ మహ్మద్‌ ఉంటున్న నివాసం మీద గురి తప్పకుండా ఒక ప్రిడేటర్‌ దాడి జరిపింది. అక్కడికక్కడే అతడు మరణించాడు కూడా. హఖానీ నెట్‌వర్క్‌ విషయంలో కూడా పాకిస్తాన్‌ అదే విధంగా వ్యవహరిస్తుందా? లేకుంటే ఆ సంస్థను వ్యూహాత్మక సంపదగానే భావిస్తుందా? ఇదే ఇప్పుడు అందరి మది లోను కదులుతున్న ప్రశ్న.

వ్యాసకర్త బీజేపీ జాతీయ కార్యదర్శి
ఇండియా ఫౌండేషన్‌ సంచాలకులు : రామ్‌మాధవ్‌

                          


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement