పింఛన్‌ ‘చాటన్‌’!

pension stopped for Beedi packers and chatan persons - Sakshi

బీడీ ప్యాకర్లు, చాటన్‌ దారులకు జీవన భృతి నిలిపివేత

ఉమ్మడి జిల్లాలో 750 మందికి పింఛన్లు రద్దు

‘ఆసరా’కు మహిళా బీడీ కార్మికులే అర్హులు

సర్క్యులర్‌ జారీ చేసిన సెర్ప్‌ అధికారులు

ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్యాకర్లు, చాటన్‌ దారులు

ఆసరా పింఛన్లలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బీడీ ప్యాకర్లు, చాటన్‌ దారులకు అందిస్తున్న జీవన భృతి ఈనెల నుంచి నిలిచిపోయింది. బీడీలు చుట్టే మహిళా కార్మికులకే పింఛన్లు అందించాలని ఉందని, ప్యాకర్లు, చాటన్‌దారులకు అందించాలనే నిబంధన ఏమీ లేదని సెర్ప్‌ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 750 మందికి పింఛన్లు రద్దు చేస్తూ అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. సెర్ప్‌ అధికారుల నిర్ణయంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మోర్తాడ్‌(బాల్కొండ)/నవీపేట(బోధన్‌): కుదేలవుతున్న బీడీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు రాష్ట్రప్రభుత్వం మూడేళ్ల కింద బీడీ కార్మికులకు జీవనభృతి పథకాన్ని అమలు చేసింది. 2014 ఏప్రిల్‌కు ముందు పీఎఫ్‌ కలిగిన బీడీ కార్మికులకు రూ.1000 పింఛన్‌ అందజేస్తూ వస్తోంది. పనిదినాలు తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కార్మికులకు ఈ పింఛన్‌ పథకం కొద్దిమేర ఆసరాగా నిలిచింది. మొదట్లో ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే భృతి అన్న కొర్రీ విధించడంతో కార్మిక సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. దీంతో కుటుంబంలోని అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతిని అందిస్తున్నారు. జిల్లాలో 50 పైగా బీడీ కంపెనీలు ఉండగా వీటిలో దాదాపు లక్షన్నర వరకు కార్మికులు పని చేస్తున్నారు. బీడీలు చుట్టడం, చాటన్, ప్యాకింగ్, బట్టీ పెట్టడం వంటి పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు.

ప్యాకర్లు, చాటన్‌దారులకు నిలిచిన పింఛన్లు..
తెలంగాణ ప్రభుత్వం బీడీలు చుట్టే మహిళలతో పాటు బీడీ ప్యాకర్లకు, చాటన్‌దారులకు నెలనెలా జీవనభృతి అందిస్తోంది. కాగా ఈనెల నుంచి ప్యాకర్లు, చాటన్‌దారులకు జీవనభృతి నిలిపివేస్తు న్నట్లు సెర్ప్‌ అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. బీడీలు చుట్టే మహిళా కార్మికులకు మాత్రమే జీవనభృతి అందించాల్సి ఉందని, చాటన్‌దారులు, ప్యాకర్లకు అందించే నిబంధన ఏమీ లేదని సె ర్ప్‌ అధికారులు స్పష్టం చేస్తూ.. ఈనెల నుంచి వారికి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 750 మంది చాటన్‌దారులు, ప్యాకర్లకు జీవన్‌ భృతి నిలిచిపోయింది.  

అమలు కాని కనీస వేతనం..
జిల్లాలోని ఆయా బీడీ పరిశ్రమల్లో దాదాపు లక్షన్నర మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 97,010 మంది కార్మికులు జీవనభృతి పొందుతున్నారు. బీడీ కార్మికులు అంటే బీడీలు చుట్టేవారు కాకుండా ప్యాకర్లు, చాటన్‌దారులు కూడా ఉన్నారు. కాగా బీడీ కార్మికుల్లో అన్ని వర్గాల వారికి ఇప్పటికీ కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం వేతనాలు అందిస్తే ఒక్కో కార్మికుడికి కనీసం రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ప్రతినెలా అందించాల్సి ఉంటుంది. ప్యాకర్లు, చాటన్‌దారులకు కూడా పని ఆధారంగా నే వేతనం లభిస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం తమకు వేతనాలు అం దించాలని ప్యాకర్లు, చాటన్‌దారులు ఎ న్నో ఏళ్ల నుంచి కోరుతున్నా బీడీ కంపెనీల యాజమాన్యాలు స్పందించడం లే దు. వీరికి నెలకు రూ.5వేల నుంచి రూ. 6వేలకు మించి వేతనం అందడం లేదు.  

రద్దు నిర్ణయంతో ఆందోళన..
ఎప్పటిలాగే జీవనభృతి కోసం పోస్టా ఫీస్‌ కార్యాలయాలకు వెళ్లిన ప్యాకర్లు, చాటన్‌వాలాలు, బట్టీవాలాలకు పోసా ్టఫీస్‌ సిబ్బంది మొండిచేయి చూపించారు. జీవనభృతిని రద్దు చేశారని తెలిసి ఆందోళనకు గురయ్యారు. చాలీచాలని పని దినాలతో దుర్భర జీవనం గడుపుతున్న తమకు జీవనభృతి ఆసరాగా నిలిచిందని, ఇప్పుడు దానినీ రద్దు చేయడంతో ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతుండడం, వేతనంలో మార్పు లేకపోవడంతో తమ జీవితంలో వృద్ధి లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. తమకు పింఛన్‌ వర్తించదని జీవనభృతి నిలిపివేతకు తీసుకున్న నిర్ణయంతో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.

జీవనభృతి నిలిపివేయడం సరికాదు..
చాటన్‌దారులు, ప్యాకర్లకు జీవన భృతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఇప్పటివరకు పింఛన్‌ ఇచ్చి ఇప్పుడు నిలిపివేస్తే ఎవరికి చెప్పుకోవాలి. చాలీచాలని వేతనాలతో ఎలా బతకాలి. జీవనభృతితో ఉన్న కాస్త ఊరట ఇప్పుడు తొలగిపోయింది. – శాకీర్, బీడీ చాటన్‌దారు, మోర్తాడ్‌

ఆందోళనలు చేస్తాం..
బీడీ పరిశ్రమలోని కార్మికులందరూ ఒకటే. పనిదినాలు తక్కువగా ఉండడంతో తక్కువ కమీషన్‌లను వేతనం రూపంలో పొందుతున్నారు. తాజాగా పింఛన్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కార్మికులకు జీవనభృతి పునరుద్ధరించాలి. బాధితుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తాం. – నాయక్‌వాడీ శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, నవీపేట

బీడీలు చుట్టే కార్మికులకే..
బీడీ పరిశ్రమలోని బీడీలు చుట్టే కార్మికులకే జీవనభృతిని అందించాలని తాజా జీవో వెలువడింది. దాని ప్రకారమే గత డిసెంబర్‌లో జీవనభృతిని అందించాం. ఈ నిబంధనతో జిల్లాలోని 404 మంది జీవన భృతి రద్దయింది. – రవి, పెన్షన్‌ ఏపీఓ(డీఆర్‌డీఓ), నిజామాబాద్‌

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top