పన్నుఅధికారులతో ప్రధాని ఏమన్నారంటే...
నిజాయితీగా పన్ను చెల్లించేవారి పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ పన్ను అధికారులకు సూచించారు.
న్యూఢిల్లీః నిజాయితీగా పన్ను చెల్లించేవారి పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ పన్ను అధికారులకు సూచించారు. జీఎస్టీతో ధరలు తగ్గి వాటి ఫలితాలు సామాన్యుడికి చేరేలా చొరవ చూపాలని కోరారు. జీఎస్టీని సమర్ధవంతంగా అమలయ్యేలా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర అధికారులను ప్రధాని ప్రశంసించారు. దేశమంతటినీ ఒకే పన్ను మార్కెట్ పరిథిలోకి తెచ్చే విప్లవాత్మక జీఎస్టీ అమలుకు అధికారులు నిరంతరం శ్రమించారని అన్నారు.
ప్రత్యక్ష, పరోక్ష పన్ను అధికారుల రెండు రోజుల సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పన్ను అధికారులంటే ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేలా వ్యవహరించాలని అధికారులను కోరారు. ప్రధాని మోదీ తన దార్శనికతతో దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని సదస్సులో పాల్గొన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.