దిగొచ్చిన పెప్సీకో.. కేసులు వాపస్‌ | PepsiCo Withdraws Lawsuit Against Indian Potato Farmers | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన పెప్సీకో.. కేసులు వాపస్‌

May 2 2019 8:10 PM | Updated on May 2 2019 8:13 PM

PepsiCo Withdraws Lawsuit Against Indian Potato Farmers - Sakshi

గాంధీనగర్‌ : శీతల పానీయాల దిగ్గజం పెప్సీకో ఇండియా దిగొచ్చింది. గుజరాత్‌ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. తమ కంపెనీ పేరుతో భారత్‌లో రిజస్టర్‌ అయిన బంగాళాదుంపను తన అనుమతి లేకుండా పండిచారనే నేపంతో పెప్సీకో కంపెనీ 9 మంది గుజరాత్‌ రైతుల మీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దాంతో ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో కంపెనీ దిగొచ్చింది. రైతుల మీద పెట్టిన కేసులను వాపస్‌ తీసుకుంటున్నట్లు కంపెని అధికార ప్రతినిధి ప్రకటించారు. 

‘ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మా కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది’ అని సదరు అధికారి తెలిపారు. ఈ వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో తెరమీదకొచ్చింది. తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ పెప్సీకో రైతుల మీద కేసులు పెట్టడమే కాక.. వారి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ అహ్మదాబాద్‌ హై కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. దీనిపై కోర్టు కూడా… సానుకూలంగా స్పందించింది. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది. అంతేకాక తమ అనుమతి లేకుండా ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను పండించినందుకు గాను రూ. కోటి జరిమానా చెల్లించాలంటూ పెప్సీకో.. రైతులను డిమాండ్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement