జూన్ నుంచి ఒకే దేశం– ఒకే రేషన్
న్యూఢిల్లీ: వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం వచ్చే జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం(ఎఫ్పీఎస్) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు. బయోమెట్రిక్ లేదా ఆధార్ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ‘ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది’అని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ స్టాండర్డ్’పై కృషి చేస్తోందని చెప్పారు.