మేఘాలయ గనిలో మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ/ షిల్లాంగ్: మేఘాలయలో బొగ్గు గనిలో చిక్కుకుపోయిన ఘటనలో ఎట్టకేలకు ఒకరి మృతదేహం లభ్యమైంది. దీంతో పాటు కొన్ని అస్థిపంజరాలను గుర్తించామని నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ చెప్పారు. రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ (ఆర్వోవీ)కు అమర్చిన కెమెరాల సాయంతో బుధవారం రాత్రి మృతదేహాన్ని, గురువారం అస్థిపంజరాలను గుర్తించారు. గని లోపల దాదాపు 160 అడుగుల లోతులో మృతదేహాన్ని, 210 అడుగుల లోతులో అస్థిపంజరాలను గుర్తించినట్లు చెప్పారు. గతేడాది డిసెంబర్ 13న ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.