కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
రూ. 21 కోట్ల విరాళం, మరో రూ. 50 కోట్ల చేయూత
వారం రోజులపాటు సేవలను అందిస్తున్న జియో
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ఫండ్కు రూ. 21 కోట్ల విరాళం అందజేసింది. దాంతోపాటు రూ. 50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని, వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఫౌండేషన్ సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపింది. ఆగస్ట్ 14 నుంచి వయనాడ్, త్రిశూర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని వెల్లడించింది.
కేరళలోని 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోని బాధితులకు రిలయన్స్ రిటైల్ తరఫున ఆహార పదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్ వంటివి పంపిణీ చేస్తున్నామని పేర్కొంది. ఇక, కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.