
జైట్లీ వడ్డింపు.. స్వీటా? హాటా?
అవును! ఉద్యోగులదెప్పుడూ పన్ను గొడవే. వృద్ధులదైతే... వడ్డీ గొడవ. మరి కంపెనీలు..? రాయితీలడుగుతాయి.
అవును! ఉద్యోగులదెప్పుడూ పన్ను గొడవే. వృద్ధులదైతే... వడ్డీ గొడవ. మరి కంపెనీలు..? రాయితీలడుగుతాయి. ప్రోత్సాహకాలు ఇవ్వమంటాయి. బడ్జెట్ ముందు ఎప్పుడూ వినిపించేవి ఇవే కదా!! అని అంతా అనుకోవచ్చు. అసలు బడ్జెట్ అంటేనే ఆదాయ–వ్యయాల చిట్టా. మరి చేతిలో కొంత ఆదాయం మిగలాలంటే పన్ను తగ్గటమో, మినహాయింపు పరిమితి పెరగటమో జరగాలి కదా? ఉద్యోగులకు అంతకన్నా పెద్ద విషయం ఏముంటుంది? ఎవరైనా కోరుకునేది చేతికి నాలుగు డబ్బులు రావాలనే. వచ్చిన డబ్బులు మిగలాలనే. మన దేశంలో అసలు పింఛన్ భరోసా ఉన్నది ఎంతమందికి? ప్రభుత్వోద్యోగం ఉన్నది ఎందరికి? కాబట్టే అంతా పొదుపు పథకాలపై ఆధారపడతారు.
వృద్ధాప్యంలో దానిపై వచ్చే వడ్డీనే జీతంగా భావిస్తారు. కాబట్టే బడ్జెట్ ముందు ఎవరిని కదిపినా వాటిపైనే మాట్లాడారు. దీన్నుంచి మీరేం ఆశిస్తున్నారని అడిగితే... వాటికే ఓటేస్తారు. ఈసారి బడ్జెట్కు బోలెడన్ని విశిష్ఠతలున్నాయి. మొదటిది... ఇది వేళకాని వేళలో వస్తున్న బడ్జెట్. అంటే సంప్రదాయాన్ని తోసిరాజని ఫిబ్రవరి నెలాఖరుకు బదులు నెల మొదటనే తెస్తున్న బడ్జెట్. రెండోది యూపీ, పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో... ఆ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలాంటి వరాలూ ఇవ్వబోమని హామీ ఇచ్చి మరీ కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్. మూడోది... పెద్ద నోట్లను రద్దు చేసినందుకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో దాన్ని గాడిన పెట్టే చర్యలు తీసుకోవచ్చని అంచనాలు వేస్తున్న బడ్జెట్. నగదు లావాదేవీల్ని తగ్గించి డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించటం, జీఎస్టీ అమలుకు తగ్గ పరిస్థితులు సృష్టించటం... ఇవన్నీ ఈ బడ్జెట్ ముఖంగా చేపట్టబోయే చర్యలే. అందుకే దీనికంత ప్రాధాన్యం.
జనం మాత్రం... యథా ప్రకారం తమ కోరికలు ఈ సారైనా నెరవేరుతాయేమోననే ఆశలతోనే ఉన్నారు. రైతు తనకు దొరకని మద్దతు ధరను... అక్కరకు రాని పంటల బీమాను... రుణమివ్వని బ్యాంకుల్ని గుర్తు చేసుకుంటూ... అవన్నీ ఈ బడ్జెట్తో సర్దుకోవాలని ఆశిస్తున్నాడు. గృహిణులు పెరిగే ధరల్ని నిందిస్తూ... ఈ బడ్జెట్ వాటిని దించేయాలని కోరుకుంటున్నారు. చిత్రమేంటంటే అంతా ఈ బడ్జెట్లోనే ఇవన్నీ జరిగిపోతాయని ఆశిస్తున్నారు. జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అన్నీ బడ్జెట్లోనే జరిగిపోవటానికి ఇదేమైనా అక్షయ పాత్రా..? ఏమో... చూద్దాం ఈ రోజు.
వైద్యానికి 5 శాతం కేటాయించాలి
ఏటా బడ్జెట్లో వైద్య రంగానికి దేశ జీడీపీలో 1.2 శాతమే కేటాయిస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి పెంచాలి. ఈ మొత్తంలో 55 శాతాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 35 శాతాన్ని ఏరియా ఆస్పత్రులకు, 10 శాతాన్ని సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదల చేయకపోవడం వల్ల గడిచిన రెండేళ్లలో జాతీయ అంధత్వం నివారణ వంటి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఇక లైఫ్ సేవింగ్ డ్రగ్స్తో పాటు వైద్య పరికరాలపై విపరీతమైన టాక్స్ విధించడం వల్ల వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.
వీటిపై టాక్స్లు ఉపసంహరించాలి. ఆర్బీఎస్కే, జేఎస్ఎస్కే, జేఎస్వై వంటి పథకాలను ఒకే పథకంగా రూపొందించి అమలు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. ఇమ్యూనైజేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ వంటి కార్యక్రమాలు పీపీపీ పద్ధతిలో చేపడితే సత్పలితాలు సాధించొచ్చు. ప్రతీ పీహెచ్సీలో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేలా నిధులు కేటాయిస్తే టెలీ మెడిసిన్ వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కొత్త పథకాల అమలుకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. గత బడ్జెట్లో జిల్లా ఆసుపత్రులున్న చోట మెడికల్æకళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదించారు. నిధుల లేమితో ఇవి ప్రారంభం కాలేదు.
– ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర్సింగరెడ్డి, రామన్నపేట (వరంగల్ తూర్పు)
ధరలు తగ్గితేనే బతకగలం
ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా నిత్యావసర సరుకులపై భారం పడకుండా చూడాలి. ధరలు బాగా పెరిగిపోతున్నాయి. తట్టుకోవటం కష్టమవుతోంది. వివిధ వర్గాలకు అవసరమైన చిన్న చిన్న సరుకుల ధరలపై నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు అదుపులో ఉంటే రవాణా పరంగా ప్రజలపై భారం తగ్గుతుంది.
– ఎస్.రెహమాన్, చిరు వ్యాపారి, కర్నూలు
పన్ను మినహాయింపును పెంచాల్సిందే!
ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఆరేళ్లుగా పెంచలేదు. కాకపోతే పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా జీతాలు కొంత పెరిగాయి. దీనివల్ల నాల్గవ తరగతి ఉద్యోగులు కూడా ఆదాయపన్ను పరిధిలోకి వస్తున్నారు. అందుకని ఈ సారి బడ్జెట్లో తప్పని సరిగా పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నాం. పెంచకపోతే ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసినట్లే. ఎందుకంటే నూటికి నూరు శాతం పన్ను చెల్లించేది ఉద్యోగులే. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఆశిస్తున్నాం. అలా చేస్తే వ్యాపారాలు పుంజుకుంటాయి. జీఎస్టీ గానీ ప్రవేశ పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు పడిపోతాయి.
ఆంధ్రప్రదేశ్కు దీనివల్ల రూ.5వేల కోట్ల మేర పన్నులు తగ్గిపోతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ ఏడాది జీఎస్టీ ప్రవేశపెడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారన్నది బడ్జెట్లో చెప్పాలి. ఆ మేరకు కేంద్రం నిధులు కూడా కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్కు 12 విద్యాసంస్థలు, 600 కిలోమీటర్ల రోడ్లు, పోర్టులు మంజూరు చేసినట్లు కేంద్రంఘనంగా చెబుతోంది. కానీ గత బడ్జెట్లో నిధులు మాత్రం అరకొరగా కేటాయించింది. ఇలాగైతే ఏన్ని సంవత్సరాలు పూర్తయినా ఆయా ప్రాజెక్టులు ఉపయోగంలోకి రావు. అందువల్ల ఈ సారి బడ్జెట్లో సాధ్యమైన ఎక్కువ నిధులు కేటాయించాలి.
– ఎ.విద్యాసాగర్,ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నేత
వృద్ధులకైనా వడ్డీ పెంచాలి
ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీలు బాగా తగ్గిపోయాయి. నిజానికి మన దగ్గర సామాజిక భద్రత వంటివి గానీ, నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు గానీ లేవు. పెన్షన్ ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకైతే పర్వాలేదు. కానీ ప్రైవేటు రంగంలోనో, కార్పొరేట్ రంగంలోనో పనిచేసి రిటైరైన వారు తమ శేష జీవితానికి ప్రధానంగా ఆధారపడేది పొదుపు సొమ్ము. దానిపై వచ్చే వడ్డీపైనే. అయితే స్వల్పకాలిక సేవింగ్స్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్కు ప్రస్తుతం 5 శాతమే వడ్డీ ఇస్తున్నారు. కనీసం 8 శాతం ఇవ్వాలి. వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య ప్రయోజనాలు కల్పించాలి. వారి జీవితాంతం ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక పథకం ప్రకటించాలి. ప్రభుత్వమే వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి, వాటిలో చేరే సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. తక్కువ వడ్డీకే హౌసింగ్ రుణాలు ఇవ్వాలి. వృద్ధుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి.
– కె.ఎం. లక్ష్మణరావు, రిటైర్డు జనరల్ మేనేజర్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, విశాఖపట్నం
వంటింటి బడ్జెట్ సరిపోవడం లేదు
రెండున్నరేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. దీంతో వంటింటి ఖర్చులు పెరిగాయి. మునుపటిలా బడ్జెట్ కేటాయిస్తే ఇంటికి సరిపోవటం లేదు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో రెండు పూటలా టిఫిన్లు చేసుకుని ఒక్కపూట మాత్రమే భోజనం చేయాల్సి వస్తోంది. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుల ధరలు కొనడానికి దగ్గరగా లేవు. రెండేళ్ల క్రితం పప్పుల ధరలు కిలో రూ.60 ఉన్నపుడు నెలకు కిలో చొప్పున మూడు రకాల పప్పులు కొనేవాళ్లం. ధరలు పెరగడంతో రెండు రకాల పప్పులు మాత్రమే అరకిలో చొప్పున కొని సర్దుకోవాల్సి వస్తోంది. చింతపండు ధరలు పెరగడంతో పప్పుచారు రుచి మరచిపోయాం. పాల ధరలు బాగా పెరిగాయి. టీ, కాఫీ పొడుల ధరలూ అంతే. నూనెల ధరల కారణంగా పిండి వంటలు తగ్గించాల్సి వస్తోంది. నిత్యం కూరలు తగ్గించి పచ్చళ్లే చేసుకోవాల్సి వస్తోంది. దిగువ మధ్య తరగతి వాసుల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇక స్కూలు ఫీజుల వంటి మోతలు షరా మామూలే. నోట్ల రద్దుతో కుటంబ ఖర్చులను తగ్గించాం. వచ్చే బడ్జెట్లోనైనా నిత్యావసరాలపై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఉంది.
– ఎస్.రమాదేవి,హాలియా, నల్లగొండ జిల్లా
యువతలో స్కిల్స్ను పెంచాలి..
దేశంలో ఎక్కువ శాతం ఉన్నది యువతే.. నిరుద్యోగులూ వీరే.. చదువుకున్న వారిలో 10 శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలిన వారు నెలకు రూ.7 వేల వేతనం ఇచ్చే ఉద్యోగాలు చేయాల్సి వస్తోందంటేనే పరిస్థితి అర్థమవుతుంది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసినా ఉద్యోగాలు సాధించే నైపుణ్యలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఉద్యోగాలు దొరకటం లేదు. అలాంటి వారిలో నైపుణ్యాల్ని పెంచేందుకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాజెక్ట్ తేవాలి. ఉద్యోగాలే కాకుండా స్వయం ఉపాధి పైన దృష్టి పెట్టాలి. ప్రస్తుతం కొన్ని అంశాల్లో మాత్రమే ఉపాధి శిక్షణ ఇస్తున్నారు. దీన్ని అన్ని రంగాలకు విస్తరించటమే కాక బ్యాంకు రుణాలు వచ్చేలా చూడాలి. ప్రస్తుతం బ్యాంకులు అర కొర రుణాలిస్తూ... వాటికీ లక్ష కొర్రీలు వేస్తున్నాయి.
యువత అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న ప్రతి పైసానీ ప్రభుత్వాలు పెట్టుబడిగానే భావించాలి. కొన్ని వర్గాలకు చెందిన ఔత్సాహిక ప్రారిశ్రామిక వేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. అన్ని వర్గాలలో నిరుపేదలున్నారు. వారికీ ఫలాలు అందాలి. పెద్ద నోట్లు రద్దు తరువాత డిజిటల్ చెల్లింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ చెల్లింపుల్లోనూ యువతదే పైచేయి. వారిని మరింత ప్రోత్సహించేలా రాయితీలివ్వాలి. చాలా చోట్ల ఈ – పేమెంట్లపై పన్నులు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎత్తేయాలి. క్రీడల్లోను యువతకు ప్రాధాన్యమిస్తూ ఆ మేరకు కేటాయిపులు జరపాలి. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించాలి. అన్ని క్రీడల్నీ సమానంగా భావించి కేటాయింపులు జరిపితే మెరికల్లాంటి క్రీడాకారులు తయారవుతారు.
– ఆర్.వినయ్రెడ్డి, రంగారెడ్డి జిల్లా
సాగుభద్రతకు ప్రత్యేక నిధి ఇవ్వాలి
దేశంలో రైతులకిపుడు చాలా సమస్యలున్నాయి. మద్దతు ధర అనేది ఎప్పటికీ అందని ద్రాక్షే. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోతే ఏడాది దాటినా పరిహారం రావడం లేదు. బీమా కంపెనీలపై నమ్మకం పోతోంది. పంట చేతికి వచ్చే సమయానికి ధర ఉండడం లేదు. మార్కెట్లోకి వెళ్లిపోయిన తరువాత మాత్రం రేటు పెరుగుతోంది. అటువంటప్పుడు కేంద్రం రైతుకు ప్రత్యేక నిధి ఇచ్చి ఆదుకోవాలి కదా? ఇందుకోసం బడ్జెట్లో కనీసం రూ.50 వేల కోట్లయినా కేటాయిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది. సాగు భద్రత మాత్రం లేదు. పంట పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలి.
ఒకవేళ మార్కెట్లో మద్దతు ధర తగ్గినట్టయితే కేంద్రమే నేరుగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులనూ కొనుగోలు చేయాలి. రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సామూహికంగా కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లు నిర్మించాలి. రైతులు సొంతంగా నిర్మించుకుంటే 90 శాతం రాయితీ ఇచ్చేందుకు సైతం నిధులు కేటాయించాలి. కొబ్బరి వంటి వాణిజ్య పంటలను దేశంలో అమ్ముకునేందుకు వీలు కల్పిస్తామన్న కేంద్రం ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ విస్తరించేందుకు, రైతులకు వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు నిధులు కేటాయించాలి. పంట పెట్టుబడికి తగినవిధంగా రుణాలు మంజూరు చేసి, జీరో పర్సంట్ వడ్డీకి అందించాలి. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం కాకుండా బడ్జెట్లో కనీసం రూ.10 వేల కోట్లు కేటాయించాలి. – యాళ్ల వెంకటానందం, భారతీయ కిసాన్ సంఘ్, తూర్పు గోదావరి
మొబైల్స్ జోలికెళ్లకుండా ఉంటే బెటర్
బడ్జెట్లో గనక మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించినా, పెంచినా ఇబ్బందులే ఉంటాయి. గత ఏడాది స్మార్ట్ఫోన్ ధరలు ఒకేసారి తగ్గాయి. దీంతో షాపులో ఉన్న మొబైళ్లను తగ్గించిన ధరలకే విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల నష్టం వచ్చింది. ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మొబైల్స్ ధరల జోలికి వెళ్లకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. నిరుద్యోగిగా నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఎనిమిదేళ్లుగా సెల్ఫోన్ల విక్రయ దుకాణాన్ని నడుపుతున్నా. మా మెదక్ జిల్లాలో మొబైల్స్ విక్రయాలు భారీగా ఉంటాయి. నెల వారీగా చూస్తే.. శామ్సంగ్ రూ.1.20 కోట్లు, వీవో మొబైల్స్ రూ.50 లక్షలు, ఒప్పో రూ.50 లక్షలు, సెల్కాన్, మైక్రోమ్యాక్స్, కార్బన్ మొబైల్స్ కలిపి నెలకు రూ.3 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం మొబైల్ వినియోగంపై క్రేజ్ పెరిగింది. సామాన్యుడికి సైతం అందుబాటులోకి ఫోన్లు రావాలంటే ధరల నియంత్రణ అవసరం.
– జి.రాజేశ్, మొబైల్ షాపు యజమాని, జోగిపేట
ఎగుమతి రాయితీలివ్వాలి
మేక్ ఇన్ ఇండియా నినాదంతో మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్లో తయారీని ప్రారంభించాయి. చాలా కంపెనీలు సొంత ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఎగుమతులను ప్రోత్సహిస్తేనే ఈ సంస్థలకు ప్రయోజనం. ఇందుకోసం ఎగుమతి రాయితీలు కనీసం 7 శాతమైనా ఇవ్వాలి. చైనా 17 శాతం ఇస్తోంది కాబట్టే అక్కడ తయారీ మంచి ఊపుమీద ఉంది. ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ కోరినట్టు ప్రభుత్వం గనక రాయితీలు ప్రకటిస్తే ఆఫ్రికాతో పాటు ఎన్నో దేశాలకు మొబైల్ ఫోన్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేసే అవకాశం వస్తుంది. విడిభాగాల తయారీ కంపెనీలనూ పన్ను మినహాయింపులతో ప్రోత్సహించాలి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు దేశంలో అధికమయ్యాయి. స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మొబైళ్లపై వ్యాట్ 5 శాతం, ఎక్సైజ్ సుంకం 2 శాతముంది. జీఎస్టీ అమలైతే పన్ను 12 శాతానికి మించకూడదు. పన్ను పెరిగితే ఆ భారం తిరిగి సామాన్య ప్రజానీకంపైనే పడుతుంది.
– వై.గురు, సీఎండీ,సెల్కాన్ మొబైల్స్
స్టార్టప్ ట్యాక్స్ హాలిడే పొడిగించాలి
దేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు స్టార్టప్లు టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపిస్తున్నాయి. కాబట్టి అలాంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం స్టార్టప్స్కున్న మూడేళ్ల ట్యాక్స్ హాలిడేను 5–7 ఏళ్లకు పొడిగించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో స్టార్టప్స్, ఉద్యోగులకు ప్రత్యేకమైన ఆదాయ పన్ను శ్లాబ్లను ప్రకటించాలి. లేదా పూర్తిగా మినహాయించాలి. అప్పుడే ప్రతిభావంతమైన యువత స్టార్టప్లలోకి వస్తారు. స్టా్టర్టప్ కంపెనీలు పెట్టడమే కాదు. దాన్లోకి ఉద్యోగుల్ని తీసుకోవటానికి కూడా ఈ ప్రోత్సాహకాలు పనికొస్తాయి. స్టార్టప్ కంపెనీలకు ఏంజిల్ ఫండింగ్ అనేది తొలి ఆర్ధిక వనరు. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం పన్నులు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయి. దీంతో కొత్త కొత్త ఆలోచనలు ఆదిలోనే ఆగిపోతున్నాయి.
ఏంజిల్ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. గతంలో ప్రకటించిన స్టార్టప్ ఇండియా పాలసీ, క్రెడిట్ గ్యారంటీ స్కీంను పూర్తిగా అమలులోకి తీసుకురావాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా వరకు లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. కానీ, ఈ–లావాదేవీలతో కస్టమర్లకు, కంపెనీలకు ఇద్దరికీ పన్నులు పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విజయవంతం కావాలంటే ఈపేమెంట్స్ పన్నులను మినహాయించాల్సిందే. అలాగే డిజిటల్ లావాదేవీలను వినియోగించుకునేందుకు వీలుగా వేగవంతమైన ఇంటర్నెట్, సబ్సిడీ డేటాను అందిచాల్సిన అవసరం కూడా ఉంది. – శ్రీనివాస్ కొల్లిపర,
టీ–హబ్ ఫౌండర్ అండ్ సీఓఓ