సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే | govt employees stage protest in jantharmanthar over cps | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే

Mar 2 2017 8:31 PM | Updated on Sep 5 2017 5:01 AM

సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు కదంతొక్కారు.

ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు
జంతర్‌మంతర్‌ వద్ద మహా ధర్నా..
పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్‌ ఉద్యోగలు ఫోరం సభ్యులు


న్యూఢిల్లీ:
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్‌మంతర్‌ వేదికగా ‘పెన్షన్‌ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’ అంటూ నినదిస్తూ పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్‌ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్‌ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలభారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్‌ డిమాండ్‌ చేశారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. పెన్షన్‌ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదన్నారు.

దీని వల్ల ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇలా ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీనిని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామన్నారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్‌ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement