సరిహద్దు ఘర్షణ: నలుగురు సైనికుల పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: లడక్లో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సైనికుల మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "దేశాన్ని కాపాడే క్రమంలో గాల్వన్ లోయలో ప్రాణ త్యాగం దేసిన భారత సైనికులకు సెల్యూట్ చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు)
లడఖ్లో జరిగిన దాడుల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన సైనిక వీరుడు రాజేశ్ ఒరంగ్ అమరుడయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని కుటుంబం బీర్భమ్లో నివసిస్తోంది. అతడు భారత ఆర్మీకి ఆరేళ్లుగా సేవలందిస్తున్నాడు. భారత్-చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గాల్వన్ లోయలో 26 ఏళ్ల రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. గత యాభై ఏళ్లలో తొలిసారిగా సరిహద్దులో తీవ్రస్థాయి ఘర్షణలు చెలరేగగా, ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కుటుంబానికి రాజేశే పెద్ద దిక్కని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. (లడక్ కాల్పుల్లో పళని వీరమరణం)