సాక్షి, న్యూఢిల్లీ : పశుగ్రాస కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారనే వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు ఈసీ ఆదేశించింది. లాలూ ప్రస్తుతం జార్ఖండ్లోని రాంచీలో బిర్సా ముందా సెంట్రల్ జైలులో ఉన్నారు. కాగా లాలూ జైలు నుంచే ట్విటర్, ఫేస్బుక్ ఖాతాలను నిర్వహిస్తున్నారా లేక వెలుపలి నుంచి వేరొకరు వీటిని నిర్వహిస్తున్నారా అనేది ఈసీ నిర్ధారిస్తుందని బిహార్ ఎన్నికల ప్రధానాధికారి హెచ్ఆర్ శ్రీనివాస చెప్పారు.
లాలూపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆయనపై చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. లాలూ ప్రసాద్ ట్విటర్ ఖాతాపై ఈసీ దృష్టిసారించిందని పట్నా రిటర్నింగ్ అధికారి సంజయ్ సింగ్ పేర్కొన్నారు. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి మూడు కేసుల్లో బెయిల్ను కోరుతూ లాలూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ముందుకు రావడం ఆయనకు ఇబ్బందికరమేనని చెబుతున్నారు.