ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రపంచంలో అతిపెద్ద కిడ్నీ కణితిని తొలగించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రపంచంలో అతిపెద్ద కిడ్నీ కణితిని తొలగించారు. కిడ్నీ కేన్సర్తో బాధపడుతున్న 65 ఏళ్ల కేఎల్ దాస్కు ఆపరేషన్ చేసి 5.018 కిలోల బరువున్న కణితిని తీసివేశారు. వైద్య పరిభాషలో ఇదే అతిపెద్ద కిడ్నీ కణితని వైద్యులు తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారని వైద్యులు చెప్పారు.
పేషంట్ కుడి కిడ్నీ సాధారణ సైజు కంటే 35 రెట్లు వాపు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తులకు కూడా కేన్సర్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. శరీరంలోని ఇతర భాగాలకు కేన్సర్ వ్యాపించకుండా నివారించేందుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. దాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలో గంగారామ్ ఆస్పత్రిలో 2.5 కిలోల బరువున్న కిడ్నీ కణితిని తొలగించారు. అప్పట్లో ఇదే అతిపెద్దదిగా నమోదైంది. తాజాగా దీనికి రెట్టింపున్న కణితిని తొలగించారు.