‘ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను’

Sonali Bendre Reveals She Cried On Entire Night After Knowing About Her Health - Sakshi

తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నానంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ సొనాలీ బింద్రే.. చేదు నిజాన్ని వెల్లడించిన నాటి నుంచి ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో వేదనకు గురయ్యారు. సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్‌ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది బాలీవుడ్‌ షాకింగ్‌ మూమెంట్స్‌లో ఇదొకటి. అయితే న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్న అనంతరం సొనాలీ ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఆమె తిరిగి ముంబైకి రావడంతో పాటు కొన్ని యాడ్‌ షూటింగ్‌లలో కూడా పాల్గొంటూ మళ్లీ సాధారణ జీవితంలో పడిపోయారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే తనకు క్యాన్సర్‌ అని తెలియగానే షాక్‌ గురైన సొనాలీ ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారట.

‘ ఈ విషయం గురించి తెలిసిన రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. కానీ మరుసటి రోజే నిజాన్ని అంగీకరించాను. ఇకపై ఏడ్వకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో మళ్లీ సంతోషం మొదలైంది. నా జీవితంలో సూర్యుడు మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టాడు. ఇందుకు నిదర్శనంగా నా కుటుంబం, నా గర్ల్స్‌(తన స్నేహితురాళ్లను ఉద్దేశించి)తో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసినపుడు స్విచ్‌ ఆన్‌ సన్‌షైన్‌ అని పెడతాను’ అంటూ బీఎఫ్‌ఎఫ్‌(బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌) విత్‌ వోగ్‌ సీజన్‌ 3లో తన భర్త, స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి మరోసారి చెప్పుకొచ్చారు.

అదీ ఓ కారణం..
‘ గోల్డీని పెళ్లి చేసుకుని 16 ఏళ్లు అయ్యింది. నాకు క్యాన్సర్‌ అని తెలియగానే మొదట నాకు గుర్తొచ్చిన వ్యక్తి తనే. నాకేమైనా అయితే తను ఎలా ఉండగలుగుతాడనే ఆలోచన నన్ను వెంటాడేది’ అని పేర్కొన్నారు. అదే విధంగా న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తన ప్రాణ స్నేహితులు సుసానే ఖాన్‌(హృతిక్‌ మాజీ భార్య), గాయత్రి జోషి అక్కడికి వచ్చి తనతో సమయం గడిపేవారని తెలిపారు. పిల్లలను స్కూళ్లో డ్రాప్‌ చేయడం, మళ్లీ నా దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పడం, ఇలా నా కోసం ఎంతో సమయం కేటాయించేవారు. కీమో, సర్జరీ జరుగుతున్న సమయంలోనూ నేను ధైర్యంగా ఉండటానికి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల సాన్నిహిత్యం కూడా ఓ కారణం అని సొనాలీ చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top