
చెన్నై, సాక్షి: నటి సమంత పీహెచ్డీ చేశారు. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత ఏ రంగంలో ఏ సబ్జెక్ట్ మీద పీహెచ్డీ చేశారని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే యువ నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత నటనకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. తెలుగులో రామ్చరణ్కు జంటగా 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'మహానటి'లో పాత్రికేయరాలిగా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.
కన్నడ చిత్రం 'యూటర్న్' రీమేక్లోనూ నటించడానికి రెడీ అవుతున్న సమంత కోలీవుడ్లోనూ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి విశాల్తో జత కడుతున్న 'ఇరంబుతిరై'.. మరొకటి శివకార్తీకేయన్తో నటిస్తున్న చిత్రం.. పొన్రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
ఇక, విశాల్కు జంటగా నటిస్తున్న 'ఇరుంబుతెరై' చిత్రంలో సమంత పీహెచ్డీ చేయబోతున్నారు. సైకాలజీలో పీహెచ్డీ చేసిన డాక్టరుగా ఆమె నటిస్తున్నారు. పేరు డాక్టర్ రతీదేవి. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఎవరికి తన వైద్యం అందిస్తారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి బరిలోకి దిగడానికి ఇరుంబుతెరై చిత్రం ముస్తాబవుతోంది. అప్పుడు డాక్టర్ రతీదేవిని పరిచయం చేస్తామని విశాల్ ట్విట్టర్లో తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలనిజం ప్రదర్శిస్తున్న ఈ చిత్రానికి పీఎస్. మిత్రన్ దర్శకుడు. విశాల్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఒక నక్షత్ర హోటల్లో జరిగింది.