నయనకు అంతనా!

Nayantara the highest paid actress in South India - Sakshi

తమిళసినిమా: నయనతార మార్కెట్‌ నానాటికీ పెరిగిపోతోంది. మొదట్లో అందాలొలకబోయడానికే పరిమితం అయిన ఈ కేరళా భామ ఆ తరువాత అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటుకుంటోంది. ఇంకా చెప్పాలంటే అరం చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా నయనతార స్థాయి మారిపోయింది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఈ సంచలన నటి స్థాయికి తగ్గట్టుగా పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందనే చెప్పాలి. అయినా చిత్ర అవకాశాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో సగం వరకూ లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలే కావడం విశేషం. అగ్రనటిగా రాణిస్తున్న నయనతార మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం.

కథలను నమ్ముకుని చిత్రాలు చేసే దర్శకుల్లో విజయ్‌ ఒకరు. ఈయన ఇంతకు ఇటీవల ప్రభుదేవా, తమన్నా జంటగా దేవి, సాయిపల్లవిని కోలీవుడ్‌కు పరిచయం చేస్తూ దియా చిత్రాలను చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా,ఐశ్వర్యరాజేశ్‌ హీరోహీరోయిన్‌గా లక్ష్మీ చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది డాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా హర్రర్‌ చిత్రాన్ని తెరక్కెస్తున్నారు. దీని తరువాత నయనతార ప్రధాన పాత్రలో ఒక చిత్రం చేయడానికి రెడీ అవుఉన్నారు. ఈ చిత్రంలో నయనతారకు పారితోషికం అక్షరాలా రూ. 5.5 కోట్లనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదే గనక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నమోదవుతుంది. ఈ చిత్రం తరువాత విజయ్‌ దేవి–2 చిత్రం, విక్రమ్‌ హీరోగా చిత్రం అంటూ బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top