తారల పేర్లతో తినే పదార్థాలు | Latest Entry Of Dishes Named After Indian Film Stars | Sakshi
Sakshi News home page

Jan 5 2019 2:40 PM | Updated on Jan 5 2019 4:48 PM

Latest Entry Of Dishes Named After Indian Film Stars - Sakshi

దీపికా పదుకోన్‌ దోశ పేరు వినబడగానే ఒక్క ఆమె అభిమానులకే కాకుండా ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయేమో!

సాక్షి, న్యూఢిల్లీ : ‘వేడి వేడి దీపికా పదుకోన్‌ దోశ, పసందైన దోశ!’ అని వినబడగానే ఒక్క ఆమె అభిమానులకే కాకుండా ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయేమో! అమెరికాలోని ఆస్టిన్‌లో ‘దోశ లాబ్స్‌’ హోటల్‌లో పశ్చిమిరపకాయలు, ఆలు కుర్మాతో కూడిన ‘దీపికా పదుకోన్‌ దోశ’ను విక్రయిస్తున్నారంటూ వార్త ఒకటి జనవరి ఒకటవ తేదీన వైరల్‌ అయింది. దాంతో భారత్‌లోని పుణెలో ఆమె పేరుతో ‘పరంతా తాళి’ అంటూ భోజనాన్ని విక్రమిస్తున్నారంటూ ట్వీట్లు వెలువడ్డాయి. ఆ మాటకొస్తే ఆమె ఒక్కదాని పేరు మీదనే కాకుండా పలువురు సినీ తారల పేర్ల మీద భారత్‌లోని పలు ప్రాంతాల్లో పలు హోటళ్లు తిను బండారాలు విక్రయిస్తున్నారు. కొందరైతే సినీ తారలు సినిమాల్లో నటించిన పాత్రల పేరిట కూడా తినుబంఢారాలను విక్రయిస్తున్నారు.


ముంబైలోని నూర్‌ మొహమ్మది హోటల్‌లో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ పేరు మీద ‘చికెన్‌ సంజూ బాబా’ను విక్రయిస్తున్నారు. 95 ఏళ్ల పురాతనమైన ఆ హోటల్‌ యజమాని ఖలీద్‌ హకీమ్, సంజయ్‌తో తనకున్న అనుబంధానికి గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నారు. ఆ హోటల్‌లో 1986లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ సెక్షన్‌ను సంజయ్‌ దత్‌ రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. అప్పడు సంజయ్‌కి హోటల్‌ యజమాని ఓ చికెన్‌ డిషన్‌ను సర్వ్‌ చేశారు. అప్పటి నుంచి ఆ డిష్‌కు ఆయన పేరే పెట్టారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో మూడేళ్ల జైలు నిర్బంధం అనంతరం 2016, పిబ్రవరిలో సంజయ్‌ విడుదలైనప్పుడు ఈ హోటల్‌ యజమాని 12 గంటలపాటు చికెన్‌ సంజు బాబా డిష్‌ను ఉచితంగా ప్రజలకు పంచి పెట్టారు.

ముంబైలోని ‘అర్బన్‌ తడ్కా’ హోటల్లో బాలివుడ్‌ నటుడు ఓం పురి పేరిట ‘మటన్‌ సాగ్‌వాలా’ను కొన్నేళ్లుగా విక్రయిస్తున్నారు. పాలకూరతో చేసిన ఆ మటన్‌ను తినేందుకు ఓం పురి తరచుగా ఆ హోటల్‌కు వచ్చేవారట. అందుకు ఆ పేరు పెట్టారట. బాండ్రాలోని శాంటే హోటల్‌లో బాబీ డియోల్‌ పేరుతూ ‘బాబీ కేక్‌ను విక్రయిస్తున్నారు. బాబీ డియోల్, ఆయన కుటుంబం ఆ హోటల్‌కు తరచూ వచ్చి ఆ కే క్‌లు తినేవారట. అలా ఆయన పేరూ అలా స్థిర పడింది. 2013లో వచ్చిన ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై దుబారా!’ అక్షయ్‌ కుమార్‌ నటించిన పాత్ర పేరు ‘షోయబ్దిని’ ఓమన్‌ రిసార్ట్‌లోని ఓ కాక్‌టెయిల్‌కు పెట్టారు.

చిరు దోశ కూడా!
తెలుగు సినీ నటుడు చిరంజీవి పేరిట తెలగునాట నూనే లేకుండా ఆవిరి మీద ఉడికించే ‘చిరు దోశ’ కూడా చెలామణì లో ఉంది. ఆన్‌లైన్‌లో ఎక్కువగా కనిపించే ఈ దోశ హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి నుంచే పాకిందట. 2015లో ఈ దోశపై పేటెంట్‌ హక్కులు పొందేందుకు ఆయన కుమారుడు రామ్‌ చరణ్‌ ప్రయత్నించారట. మైసూర్‌లోని ఓ చిన్న ఫుడ్‌ కార్నర్‌లో ఈ దోశను చిరంజీవి కనిపెట్టారట. హైదరాబాద్‌లోని ‘చట్నీస్‌’ కూడా కొంతకాలం ‘చిరంజీవి దోశ’ అంటూ స్టీమ్డ్‌ దోశను చెలామణి చేసింది.


Advertisement
Advertisement
 
Advertisement
Advertisement