చెన్నైలో కొన్ని రోజులు... తెన్‌కాశీలో 40 రోజులు!

Karthi-Pandiraj film to be predominantly shot in Tenkasi - Sakshi

మ్యాగ్జిమమ్‌ హీరోలు ఓ సినిమా చిత్రీకరణ పూర్తిచేసిన తర్వాత మరో సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారు. అందువల్ల, దర్శకులకు హీరోలతో పెద్ద చిక్కులేవీ వుండవు... షెడ్యూల్స్‌ విషయంలో! హీరోయిన్లు మాత్రం ఒక్కోసారి రెండు మూడు సినిమాలు చేస్తుండడంతో వాళ్ల కోసం కొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు! ఇప్పుడు తమిళ హీరో కార్తీ, దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్యలది సేమ్‌ సిట్యువేషన్‌. తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో అన్నయ్య అండ్‌ హీరో సూర్య ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ‘అఖిల్‌’ ఫేమ్‌ సాయేషా సైగల్‌ హీరోయిన్‌. ఇప్పుడామె ప్యారిస్‌లో మరో తమిళ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. అందువల్ల, ఆమె కోసం ఓ షెడ్యూల్‌ను కాస్త అలస్యంగా ప్లాన్‌ చేశారట! దర్శకుడు ఈలోపు చెన్నైలో హీరో, ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్‌ నుంచి రాగానే సాయేష ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. చెన్నైలో కొన్ని రోజులు చిత్రీకరించిన తర్వాత, తెన్‌కాశీలో 40 రోజులు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తెన్‌కాశీ అంటే... తమిళనాడులోని తిరుణవేళి జిల్లాలోని ఓ ప్రాంతం పేరు.

కార్తీ సినిమాలో నేనున్నాను:
సాయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరోయిన్‌ ప్రియా భవానీశంకర్‌ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే... మూవీ ఓపెనింగ్‌ రోజున ప్రియ ఎక్కడా కనిపించకపోవడంతో సినిమాలో ఆమె నటించడం లేదని వార్తలొచ్చాయి. వీటిని ఖండించారామె. ‘‘కార్తీ–పాండిరాజ్‌ మూవీలో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. మై బ్యాడ్‌ లక్‌... ఓపెనింగ్‌ పిక్స్‌లో నేను కనిపించలేదు. అందువల్లే ఈ కన్‌ప్యూజన్‌. దీనికి ఐయామ్‌ సారీ’’ అని వివరణ ఇచ్చారు ప్రియ. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో రెండు మూడు రోజులు కార్తీ సెలవులు తీసుకోనున్నాడు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా ‘ధీరమ్‌ అధిగారమ్‌ ఒండ్రు’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది. రకుల్‌ హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాను తెలుగులో ‘ఖాకి’గా విడుదల చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top