
కేంద్ర బడ్జెట్ పై చర్చించనున్న హీరోయిన్
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్ కేంద్ర బడ్జెట్ పై చర్చించనున్నారు. ఓ ప్రముఖ బిజినెస్ ఛానల్ ఫిబ్రవరి 29న నిర్వహించబోయే చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొంటారట.
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్ కేంద్ర బడ్జెట్ పై చర్చించనున్నారు. ఓ ప్రముఖ బిజినెస్ ఛానల్ ఫిబ్రవరి 29న నిర్వహించబోయే చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొంటారట. బడ్జెట్ పై అంచనాలు, అభిప్రాయాలను కరీనా విశ్లేషించనున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే సన్నద్ధమయ్యారని వినికిడి. 'ఈ సారి బడ్జెట్ ఎలా ఉంటుందనుకుంటున్నారు' అని విలేకరులు అడగ్గా.. సామాన్యులను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం పన్నుల విధానాల్ని క్రమబద్ధీకరించాలని, అక్షరాస్యతపై అవగాహన కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళ భద్రతకు పెద్ద పీట వేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై కరీనా సన్నిహితులు స్పందిస్తూ.. ఆమెకు ప్రభుత్వ పాలనపై, సమాజంపై పూర్తి అవగాహన ఉందని, అనుభవమున్న ఆర్థిక విశ్లేషకులకు ఏమాత్రం తీసిపోకుండా బడ్జెట్ విశ్లేషణతో అభిమానులను ఆకట్టుకుంటుందని అన్నారు.
కాగా కరీనా తదుపరి చిత్రం 'కీ అండ్ కా' ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో కరీనా ఉద్యోగం చేస్తూ ఇంటిని నడిపే మోడ్రన్ ఇల్లాలి పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ కపూర్ ఇంటి వద్దే ఉంటూ ఇంటి బాగోగులు చూసుకునే భర్త పాత్ర పోషిస్తున్నారు. కీ అండ్ కా ఎఫెక్టో ఏమోగానీ బెబో.. 'బ్యూటీ విత్ బ్రెయిన్' అనిపించుకుంటున్నారు.