నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్‌ | Allu Sirish-Vi Anand film redeems itself in an unexpected way | Sakshi
Sakshi News home page

నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్‌

Jan 8 2018 1:42 AM | Updated on Jan 8 2018 1:42 AM

Allu Sirish-Vi Anand film redeems itself in an unexpected way - Sakshi

‘‘నా కెరీర్‌లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. మలయాళ సినిమా ‘1971 బియాండ్‌ బోర్డర్‌’లో మోహన్‌లాల్‌గారితో నటించా. నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. డిసెంబర్‌ 28న విడుదలైన ‘ఒక్కక్షణం’ నాకు మరచిపోలేని సినిమాగా నిలిచింది’’ అని హీరో అల్లు శిరీష్‌ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్‌ కపూర్‌ ముఖ్య తారలుగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. అల్లు శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘గౌరవం’ సరైన విజయం అందుకోలేదు. దాంతో కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది.

‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ వంటి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ చేశాక మళ్లీ ధైర్యం తెచ్చుకుని, ఏదైనా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ‘ఒక్కక్షణం’ చేశా. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. సినిమా చూసినవారందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్‌ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థ్యాంక్స్‌. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వీఐ ఆనంద్‌. ‘‘ఒక్కక్షణం’ సక్సెస్‌తో 2018కి మేం సంతోషంగా స్వాగతం పలికేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సీరత్‌ కపూర్‌. నిర్మాత చక్రి చిగురుపాటి, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement