కేరళ వరదలు : ‘మ’ల్లు అర్జున్‌ పెద్ద మనసు

Allu Arjun donated 25 lakhs to kerala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి విలయానికి  విలవిల్లాడిన కేరళను ఆదుకునేందుకు సినీ రంగ ప్రముఖులు  కదిలి వస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ మెగా స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ స్పందించారు.కేరళ ప్రజలుకురిపించే ప్రేమాభిమానాలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందంటూ ట్వీట్‌ చేశారు. భారీ వర్షాలు, వరదలతో  అతలాకుతలమైన కేరళ ప్రజల నష్టాన్ని పూడ్చలేనిది అయినా తన వంతుగా సాయం అందిస్తున్నట్టు సోమవారం   వెల్లడించారు.  25 లక్షల రూపాయలను  కేరణ ప్రజలకోసం విరాళమిస్తున్నట్టు ట్విటర్‌ లో ప్రకటించారు. 

మరోవైపు సహాయ, పునరావాస  కార్యక్రమాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధిగా విరివిగా విరాళాలివ్వాల్సిందిగా  రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ముందుగా స్పందించిన హీరో సూర్య, కార్తి 25 లక్షల రూపాయలను ప్రకటించగా, హీరో రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా విరాళం ప్రకటించారు. టాలీవుడ్‌ హీరో అర్జున్‌ రెడ్డి సైతం 5లక్షల రూపాయలను డొనేట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా గత అయిదు రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. గత వందేళ్లలో ఇలాంటి విపత్తు సంభవించ లేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించిందంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అర‍్థం చేసుకోవచ్చు. కేరళలో మొత్తం 14జిల్లాలకుగానూ 10 జిల్లాల్లో  వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా,  రూ. 8,316 కోట్ల నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరద సహాయ శిబిరాల్లో దాదాపు 60వేల మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యల‍్ని ముమ్మరంగా  అందిస్తున్నాయి. కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ రోజు కేరళ వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top