నిర్మాతగా నీలిమ | Actress Neelima Rani turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా నీలిమ

Oct 8 2017 5:27 AM | Updated on Oct 8 2017 5:27 AM

Actress Neelima Rani turns producer

తమిళసినిమా: నటిగా తనదైన ముద్రవేసుకున్న నీలిమ తాజాగా నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. దేవర్‌మగన్‌ చిత్రంలో నాజర్‌ కూతురి పాత్రలో బాలనటిగా సినీరంగప్రవేశం చేసిన నీలిమ ఆ తరువాత నాన్‌మహాన్‌ అల్ల, మురణ్, తిమిరు,సంతోష్‌సుబ్రమణియం, మొళి మొదలగు 50 చిత్రాలకు పైగా వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే విధంగా బుల్లితెరపైనా వాణిరాణి, తామరై, తలైయనై పూక్కళ్‌ తదితర 80 సీరియళ్లలో నటించారు. అలా తన 20ఏళ్ల నట పయనంలో తదుపరి ఘట్టంగా నిర్మాత అవతారమెత్తారు. ఇసైపిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలుత బుల్లితెరపై నిరం మారాద పూక్కళ్‌ అనే సీరియల్‌ను తన భర్త ఇసైవనన్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

దీని గురించి నీలిమ తెలుపుతూ నిర్మాతనవ్వాలన్నది తన 20 ఏళ్ల కల అని, అది ఇప్పటికి నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సీరియల్‌ వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మధ్యాహ్నం 2.00 గంటలకు జీ తమిళ్‌ చానల్‌లో ప్రసారం కానుందని తెలిపారు. ఇందులో మురళి, నీష్మా, అస్మిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఇనియన్‌ దినేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్‌కు విసు చాయాగ్రహణను, అర్జునన్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. దీన్ని నాగర్‌కోవిల్, మట్టం,కన్యాకుమారి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఇదే విధంగా త్వరలో చిత్ర నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు నటి నీలిమ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement