ఇక విద్యార్థులకు ‘బిర్యానీ’ | government planning to feed biryani in mid day meal | Sakshi
Sakshi News home page

ఇక విద్యార్థులకు ‘బిర్యానీ’

Jan 29 2018 6:59 PM | Updated on Aug 29 2018 7:54 PM

government planning to feed biryani in mid day meal - Sakshi

సీపీఎస్‌లో మ«ధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న దృశ్యం

వైరా/కొణిజర్ల : ప్రభుత్వం పాఠశాలల విద్యార్థలకు ఇక వేడి వేడి బిర్యానీ అందించనుంది. ప్రతి శనివారం వెజిటేబుల్‌ బిర్యానీ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆయా డీఈఓలను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం మెనూ మార్చాలని సూచించింది. దీనిలో భాగంగా ప్రతి శనివారం విద్యార్థులకు ఒక వెరైటీ బిర్యానీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గైర్హాజరీ శాతాన్ని తగ్గించి హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మెనూలో మార్పులు చేస్తూ రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

మండలంలో 20 గ్రామ పంచాయతీల పరిధిలో 48 పాఠశాలలున్నాయి. దానిలో జిల్లా పరిషత్‌ 9, ప్రాథమిక 27, ప్రాథమికోన్నత పాఠశాలలు 12 ఉన్నాయి. వాటితోపాటు ఒక్కోటి చొప్పున కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకులం, ఆదర్శ పాఠశాలలున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 3,134 మంది విద్యార్థులు విద్యనభ్యస్తున్నారు. గతంలో వారానికి రెండు గుడ్లు, కూర గాయాలతో భోజనం అందించేవారు. అనంతరం గుడ్లను మూడుకు పెంచారు. మొదట దొడ్డు బియ్యంతో భోజనం అందించగా, కొద్ది రోజులుగా సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.

 ప్రస్తుత మెనూ..  
సోమవారం గుడ్డు, సాంబార్, మంగళవారం కూరగాయలు, బుధవారం పప్పు, కూరగాయలు, గుడ్డు, గురువారం సాంబార్, శుక్రవారం కూరగాయలు, గుడ్డు, శనివారం ఆకు కూర పప్పు ఇస్తున్నారు.  అయితే.. ఇక నుంచి నెలలో మొదటి శనివారం బఠానీ పలాష్, కూరగాయలతో కుర్మా.. రెండో శనివారం కాబూలీ శనగలు, కూరగాయలతో బిర్యానీ అందిస్తారు. మూడో శనివారం మిల్‌ మేకర్‌ బిర్యానీ, కూరగాయల కుర్మా ఇవ్వనున్నారు. నాలుగో శనివారం మునక్కాయలు, పెసర పప్పుతో కిచిడి, చట్నీ.. వీటితో పాటు అన్నం టమాట, ఎండు బఠానీ కూర, పెసర పప్పులు, సోయా చిక్కుడు కూర అందించనున్నారు.  
విద్యార్థులకు వెజిటబుల్‌ బిర్యానీ పెట్టాలని మౌఖికంగా ప్రభుత్వం ఆదేశించింది.

కాని విద్యాశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. కొత్తమార్గదర్శ«కాలు రాగానే ప్రతి శనివారం కూరగాయాలు, బఠానీలు, శనగలు, మీల్‌మేకర్‌ తదితరాలతో చేసిన వెజిటబుల్‌ బిర్యానీ, కుర్మా, పెరగుచట్నీలతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలియజేసింది. ఈ మెను అమలు అయితే రోజువారీ భోజనం కంటే రుచికరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది బాలబాలికలు భోజనం చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఈ మెను అమలు చేయడానికి ప్రస్తుతం అందిస్తున్న పారితోషికం సరిపోదని ఏజెన్సీల మహిళలు అంటున్నారు. ప్రభుత్వం రేట్లు పెంచాలని కోరుతున్నారు. 

ఆదేశాలు రాగానే అమలు చేస్తాం..  
సాధారణ మెనూతో పాటు కొత్తగా విద్యార్థులకు కూరగాయలతో బిర్యానీని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. 

కె. వెంకటేశ్వరరావు, ఎంఈఓ, వైరా  

ఎటువంటి ఆదేశాలు రాలేదు.. 
ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రతి రోజు మెను అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నాం. వెజ్‌ బిర్యానీ పెట్టాలని ఆలోచన చేయడం మంచిదే. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. దీనివల్ల మండలంలో సుమారు 10 వేల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరుతుంది.

 – మోదుగు శ్యాంసన్, ఎంఈఓ, కొణిజర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement